న్యూఢిల్లీ, జూలై 24: దేశీయ పేపర్ ఇండస్ట్రీ.. నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకున్నది. నీటి వాడకాన్ని ఏకంగా 80 శాతం ఆదా చేసినట్టు సోమవారం ఇండియన్ పేపర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఎంఏ) ఓ ప్రకటనలో తెలియజేసింది. మరింతగా తగ్గించుకొనేందుకే ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. గత కొన్నేండ్లుగా పెట్టిన రూ.25,000 కోట్ల పెట్టుబడులు ఇందుకు దోహదం చేసినట్టు వివరించింది.
అంతేగాక ప్రస్తుతం భారతీయ పేపర్ పరిశ్రమ.. పర్యావరణహిత నిర్ణయాలు, చర్యలతో ముందుకెళ్తున్నట్టు పేర్కొన్నది. ‘గతంలో పేపర్ మిల్లులు టన్ను పేపర్ తయారీకి 200 క్యూబిక్ మీటర్ల నీరును వాడేవి. ఇప్పుడు 40 క్యూబిక్ మీటర్లనే వినియోగిస్తున్నాయి. మున్ముందు దీన్నీ తగ్గిస్తాం’ అని ఐపీఎంఏ అధ్యక్షుడు పవన్ అగర్వాల్ తెలిపారు. పేపర్ మిల్లు యాజమాన్యాలు పరిశ్రమలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నాయని, అందుకే నీరు, విద్యుత్తు ఆదా చేయగలుగుతున్నాయని చెప్పుకొచ్చారు.