అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయన్న అమెరికా ఫెడ్ అధికారుల ప్రకటనలు, అమెరికా, యూరప్ల్లో ఆర్థిక మాంద్యం వస్తుందన్న భయాలు, కార్పొరేట్ల ఫలితాల నేపథ్యంలో గతవారం ప్రపంచ మార్కెట్లతో పాటే భారత్ సూచీలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 71 పాయింట్ల స్వల్ప లాభంతో 18.028 పాయింట్ల వద్ద నిలిచింది. రెండు వారాలుగా నిర్దేశిత శ్రేణిలో నిఫ్టీ కదులుతున్నదని, గతవారం 330 పాయింట్ల శ్రేణికే నిఫ్టీ పరిమితమయ్యిందని ఈక్విటీరీసెర్చ్ ఆసియా వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్ తెలిపారు. ఈ వారం సైతం సూచీ కదలికలు పరిమితంగానే ఉంటాయని అంచనా వేశారు. రిపబ్లిక్డే సెలవు కారణంగా బుధవారమే జనవరి డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనున్నందున మార్కెట్లో ఒడిదుడుకులకు లోనవుతుందని స్వస్తికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా చెప్పారు.
కీలక మద్దతు 17,900
సాంకేతికంగా నిఫ్టీకి 20 వారాల మూవింగ్ ఏవరేజ్ కదులుతున్న 17,900 స్థాయి కీలకమని, అలాగే దీనికి సమీపంలోనే 17,940 వద్ద 100 రోజుల మూవింగ్ ఏవరేజ్ ఉన్నందున ఈ వారం 17900-17,940 శ్రేణి గట్టి మద్దతు ఇస్తుందని వైష్ణవ్ అంచనా వేశారు. ఈ శ్రేణిని కోల్పోతే మార్కెట్ మరింత బలహీనపడి 17,760 వరకూ తగ్గవచ్చన్నారు. నిఫ్టీ పెరిగితే తొలుత 18,300 నిరోధించవచ్చని, ఈ స్థాయిని దాటితే 18,480 పాయింట్లకు చేరవచ్చన్నారు. నిఫ్టీకి ఈ వారం 17,940, 17,800 పాయింట్ల స్థాయిలు మద్దతులుగా ఉంటాయని సంతోష్ మీనా అంచనా వేశారు. 18,250 స్థాయిని దాటితే 18,500-650 పాయింట్ల శ్రేణి వరకూ ర్యాలీ జరగవచ్చని తెలిపారు.