ముంబై, మార్చి 6: దేశీయ స్టాక్ మార్కెట్ల జోరు కొనసాగుతున్నది. రోజుకొక చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్న సూచీలు బుధవారం మరో రికార్డును సొంతం చేసుకున్నాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలకు ప్రైవేట్ బ్యాంకులు, ఐటీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో తిరిగి కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు కూడా మదుపరులను కొనుగోళ్ల వైపు నడిపించాయి. దీంతో సెన్సెక్స్ తొలిసారిగా 74 వేల మార్క్ను అధిగమించింది. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఈ మైలురాయికి చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంట్రాడేలో 474 పాయింట్లు పెరిగి 30 షేర్ల ఇండెక్స్ సూచీ చివరకు 408.86 పాయింట్లు అందుకొని 74,085.99 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 74,152 పాయింట్ల ఆల్-టైం హైకీ చేరుకున్న సూచీకి ముగింపు కూడా గరిష్ఠ స్థాయి. మరో సూచీ నిఫ్టీ సైతం 117.75 పాయింట్లు అందుకొని చారిత్రక గరిష్ఠ స్థాయి 22,474.05 పాయింట్లను తాకింది. ఇంట్రాడేలో 140 పాయింట్లు పెరిగి 22,497.20 పాయింట్లను అందుకున్న సూచీ చివర్లో ఈ లాభాలను నిలుపుకోలేకపోయింది.
తొలి సెషన్లో భారీగా నష్టపోయిన సూచీలకు ప్రైవేట్ బ్యాంకింగ్, ఫార్మా రంగ షేర్లు దన్నుగా నిలిచాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన యూరోపియన్ మార్కెట్లు తిరిగి కోలుకోవడం సూచీలకు కిక్కునిచ్చింది. కొటక్ మహీంద్రా షేరు మూడు శాతం వరకు లాభపడి టాప్ గెయినర్గా నిలిచింది. అమెరికా ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలతో అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడైనప్పటికీ, దేశీయ సూచీలు స్మార్ట్గా రికవరి బాట పట్టాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.