న్యూఢిల్లీ, జనవరి 7:వాణిజ్య వర్గాలకు, కార్పొరేట్లకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్న మోదీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు మాత్రం మొండిచేయి చూపిస్తున్నది. 2019లో ఒక్క దెబ్బతో కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించిన కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి..ముఖ్యంగా వేతన జీవులకు కనీసం పన్ను ఆదా పరిమితిని కూడా పెంచడం లేదు. 2014 నుంచి ద్రవ్యోల్బణం 46 శాతం ఎగబాకినా, ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా మినహాయింపు పరిమితి ఎక్కడిదక్కడే ఉండిపోయింది. సెక్షన్ 80సీ పరిమితిని రూ.1.5 లక్షల నుంచి పెంచాలంటూ పలు వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నా, వాటిని ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది.
వచ్చే బడ్జెట్లోనైనా ఈ పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందని వేతన జీవులు వాదిస్తున్నారు. మరోవైపు 2023 ఫిబ్రవరి 1న వెల్లడికాబోయే బడ్జెట్లో 80సీ పై సానుకూల ప్రతిపాదన ఉంటుందన్న అంచనాల్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. 2005-06లో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం అంతక్రితం ఉన్న పలు రిబేట్లను కలిపి సెక్షన్ 80సీ కింద రూ.1 లక్ష ఆదా పరిమితిని ప్రవేశపెట్టగా, అటుతర్వాత తొమ్మిదేండ్లకు 2014-15లో ఆర్థిక మంత్రిగా ఉన్న దివంగత అరుణ్ జైట్లీ ఈ పరిమితిని రూ.1.5 లక్షలకు పెంచారు. అప్పట్నుంచి మరో తొమ్మిదేండ్లు గడిచినందున మరోసారి పరిమితిని పెంచవచ్చన్న అంచనాలు వెలువడుతుండగా, ఈ ప్రభుత్వ హయాంలో ధరలు విపరీతంగా పెరిగినందున, పన్ను ఆదా పరిమితిని కూడా పెంచాల్సిందేనని నిపుణులు అంటున్నారు.
సెక్షన్ 80సీ కింద వివిధ పొదుపు పత్రాలకు, వ్యయాలకు ఇస్తున్న మినహాయింపు..పెరిగిన జీవన వ్యయంతో పోలిస్తే ఏ మాత్రం సరిపోదని పన్ను చెల్లింపుదార్లు వాపోతున్నారు. పీపీఎఫ్/ఈపీఎఫ్లకు చేస్తున్న చెల్లింపులు, పొదుపు, బీమా రక్షణల కోసం ఈఎల్ఎస్ఎస్, ఎన్ఎస్సీ, ఎన్పీఎస్, జీవిత బీమా పాలసీల్లో పెడుతున్న మదుపు వంటివాటిని ఒక వ్యక్తి తన మొత్తం వార్షిక ఆదాయం నుంచి సెక్షన్ 80సీ కింద డిడెక్ట్ చేసి ఆ మేరకు పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే పిల్లలకు చెల్లిస్తున్న ట్యూషన్ ఫీజులు, గృహ రుణ చెల్లింపుల్లో అసలు వాయిదాల్ని సైతం మినహాయించుకునే వీలుంది.
చాలామంది పన్ను చెల్లింపు వేతన జీవులకు ఇందులో కేవలం ప్రావిడెంట్ ఫండ్ డిడెక్షన్కే ఈ సెక్షన్ కింద ఇస్తున్న రూ.1.5 లక్షల పరిమితి మొత్తం ఆవిరైపోతుందని రిషాద్ మానెకియా తెలిపారు. పిల్లలకు చెల్లించే ట్యూషన్ ఫీజుకు చోటెక్కడుంటుందని ప్రశ్నించారు. ద్రవ్యోల్బణం కారణంగా ట్యూషన్ ఫీజులు, ఈపీఎఫ్ చెల్లింపులు పెరుగుతున్నాయని, గృహ రుణంలో అసలు వాయిదాల చెల్లింపు, జీవితబీమా పాలసీలు, చిన్న మొత్తాల పొదుపు, యూనిట్ లింక్డ్ స్కీములు తదితరాల్ని క్లెయిం చేసుకునే పరిస్థితి ఉండటం లేదని సంజీవ్ గోవిలా వివరించారు.
ఎన్నడూ లేనంతగా గత కొద్ది ఏండ్లుగా అనూహ్యస్థాయిలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి మధ్యతరగతి పన్ను చెల్లింపుదార్లకు ఊరటనివ్వాల్సిందేనన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. గత ఏడాది రిటైల్ ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. 2022లో వరుసగా 10 నెలల పాటు 6 శాతం ఎగువనే ద్రవ్యోల్బణం కొనసాగింది.మరోవైపు రిజర్వ్బ్యాంక్ అధిక రేట్లను వడ్డించడంతో పెరిగిన ఈఎంఐలు సామాన్యుడి నడ్డివిరుస్తున్నాయి. మధ్యతరగతికి గృహ బడ్జెట్లు పెరిగి చేతిలో చిల్లుగవ్వ కరువవుతున్నది. పెరుగుతున్న ధరా భారం నుంచి ప్రస్తుత ప్రభుత్వం ఏ రకంగానూ ఊరట కల్పించడం లేదన్న నిరాశలు వ్యక్తమవుతున్నాయని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. 2014లో ద్రవ్యోల్బణాన్ని లెక్కించే వ్యయ ద్రవ్యోల్బణ సూచి (సీఐఐ) 240 పాయింట్లు ఉండగా, అది ఇప్పుడు 331కి పెరిగింది. ప్రస్తుతం 6 శాతం మేర ద్రవ్యోల్బణం వృద్ధిచెందుతున్నందున వచ్చే ఆర్థిక సంవత్సరానికి 351కి చేరుతుంది.
అంటే మోదీ ప్రభుత్వ హయాంలో ధరలు అవలీలగా 46 శాతం పెరిగిపోయాయని విమర్శకులు ఎత్తిచూపిస్తున్నారు. సీఐఐ 240 పాయింట్లు ఉన్నపుడు రూ.1.5 లక్షలున్న పరిమితిని..సూచీ 331పాయింట్ల వద్దకు చేరుతున్నందున, ప్రస్తుతం 80సీ మినహాయింపు పరిమితి రూ.2.19 లక్షలు ఉండాలని ఫైనాన్షియల్ ప్లానింగ్ సంస్థ హమ్ ఫౌజీ ఇనీషియేటివ్స్ సీఈవో సంజీవ్ గోవిలా సూచించారు. వాస్తవానికి రూ. 1 లక్ష పరిమితిని నిర్దేశించిన 2005-06 బడ్జెట్ సమయం నుంచి ద్రవ్యోల్బణాన్ని గణిస్తే 2022-23లో 80సీ ఊరట రూ.2.82 లక్షలు ఉండాలని సంజీవ్ వివరించారు. సెక్షన్ 80సీ పరిమితిని పెంచాలంటూ వాణిజ్య, పరిశ్రమల అసోసియేషన్ పీహెచ్డీసీసీఐ ఇప్పటికే తన బడ్జెట్ ముందస్తు మోమోరాండంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజప్తి చేసింది. ద్రవ్యోల్బణం పెరిగిన రీత్యా డబ్బు విలువ, పెట్టుబడుల విలువ పడిపోయిందని అసోసియేషన్ పేర్కొంది.