Sensex Closing Bell | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు శనివారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో లాభాల్లోనే మొదలైనా చివరకు నష్టాల్లో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియాల్టీ షేర్లలో అమ్మకాలతో అస్థిరకు గురయ్యాయి. దీంతో మొదటి సెషన్లో వచ్చిన లాభాలు సైతం ఆవిరయ్యాయి. ఉదయం సెన్సెక్స్ ఉదయం 71,776.57 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. మధ్యాహ్నం వరకు అదే జోరును కొనసాగించిన సూచీలు నష్టాల్లో ముగిశాయి.
చివరకు 260 పాయింట్ల నష్టంతో 71,425 వద్ద ముగిసింది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 21,586 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో హెచ్యూఎల్, ఎంఅండ్ఎం, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ టాప్ లూజర్స్గా నిలువగా.. కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి. సెక్టోరల్లో బ్యాంక్, మెటల్, పవర్ ఇండెక్స్లు 0.5-1 శాతం, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, రియల్టీ 0.4నుంచి ఒకశాతం వరకు క్షీణించాయి.
బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 0.4 శాతం చొప్పున లాభపడ్డాయి. అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ నెల 22న స్టాక్ మార్కెట్ మూతపడనున్నది. సోమవారం ట్రేడింగ్ నిలిపివేయనున్న నేపథ్యంలో శనివారం స్టాక్ మార్కెట్లు పని చేశాయి. మళ్లీ మంగళవారం ట్రేడింగ్ జరుగనున్నది.