న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ గట్టిగా తాకినప్పటికీ.. దేశంలోని సంస్థలు మాత్రం స్థితిస్థాపకతను ప్రదర్శిస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సగటున జీతాల పెంపు 9.4 శాతం మేర ఉండొచ్చని ఓ సర్వే అంచనా వేసింది. అయాన్స్ 26వ వార్షిక వేతన పెంపు సర్వే మంగళవారం విడుదలైంది. ఇందులో 98.9 శాతం కంపెనీలు 2022లో జీతాల పెంపునకు సుముఖంగా ఉన్నట్లు తేలింది. ఈ ఏడాదికి ఇది 97.5 శాతంగానే ఉన్నది. కరోనా ప్రభావం నుంచి చాలా రంగాలు కోలుకుంటున్నాయని, ఈ నేపథ్యంలోనే 2019 స్థాయి వేతన పెంపును తమ ఉద్యోగులకు 2022లోనైనా ఇవ్వాలని ఆయా సంస్థలు భావిస్తున్నట్లు అయాన్స్ హ్యూమన్ క్యాపిటల్ బిజినెస్ భాగస్వామి రూపంక్ చౌధరి పేర్కొన్నారు. 2020, 2021 కరోనాతో ప్రభావితమైన విషయం తెలిసిందే.
గతేడాది జీతాల పెంపు 6.1 శాతంగా ఉంటే, ఈ ఏడాది 8.8 శాతంగా ఉంటుందని సర్వే చెప్తున్నది. కాగా, టెక్నాలజీ, ఈ-కామర్స్, ఐటీ ఆధారిత సేవా రంగాల్లో జీతాల పెంపు అధికంగా ఉండొచ్చని అంచనా. అయితే హాస్పిటాలిటీ, ఇంజినీరింగ్ సేవలు, ఎనర్జీ రంగాల్లోని ఉద్యోగులకు జీతాల పెంపు తక్కువగా ఉండొచ్చు. ఈ సర్వేలో మొత్తం 39 రకాల పరిశ్రమల్లోగల 1,300 కంపెనీల అభిప్రాయాలను అయాన్స్ పరిగణనలోకి తీసుకున్నది.
డిజిటలైజేషన్ బాటలో..
కరోనా మహమ్మారి అంటువ్యాధి కావడంతో దాదాపు అన్ని రంగాలు డిజిటలైజేషన్ బాట పట్టాయి. ఈ క్రమంలోనే చాలా స్వల్ప కాలంలోనే మునుపెన్నడూలేనివిధంగా డిజిటల్ టాలెంట్కు ప్రాధానత్య ఏర్పడింది. ప్రతిభ, నైపుణ్యం కలిగిన ఉద్యోగులపై ఆయా సంస్థలూ దృష్టిపెట్టాయి. ఈ క్రమంలోనే జీతాలను పెంచుతూపోతుండగా, అన్ని రంగాల్లో నియామకాలు అమాంతం పెరిగాయని రూపంక్ చౌధరి ఈ సందర్భంగా చెప్పారు. మార్కెట్లో మారిన పరిస్థితులకు అనుగుణంగా సంస్థలూ తమ వ్యాపార శైలిని మార్చేస్తున్నారన్నారు.
పెద్ద ఎత్తున పెట్టుబడులు
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో క్రమేణా అంతటా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆర్థిక వ్యవస్థ సైతం గాడిలోపడ్డ సంకేతాలు అందుతున్నాయి. దీంతో మదుపరుల్లో పెట్టుబడులపై తిరిగి విశ్వాసం ఏర్పడుతున్నదని, భారీగా వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సైతం ఇందుకు దోహదం చేస్తున్నాయని అయాన్స్ పర్ఫార్మెన్స్ సీఈవో, భాగస్వామి నితిన్ సేథీ అన్నారు. కొనుగోలుదారుల వినీమయ సామర్థ్యం పెరుగడం కూడా ఓవరాల్ సెంటిమెంట్ను బలోపేతం చేసిందని చెప్పారు.