Telangana | హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): కొత్తగా మరో మూడు ఇండస్ట్రియల్ పార్క్ల ఏర్పాటుకు లైన్ క్లియరైంది. నల్గొండ, హన్మకొండ జిల్లాల్లో ప్రతిపాదిత రెండు ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులతోపాటు మహబూబ్నగర్ జిల్లాలో ఓ ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేసింది. దీంతో ఈ మూడు పార్కుల్లో పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా భూములను కేటాయించేందుకు టీఎస్ఐఐసీకి మార్గం సుగమమైంది.
రాష్ట్ర ఆవిర్భావం నుంచీ తెలంగాణలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల ఎకరాల భూములను పరిశ్రమలకు రిజర్వు చేయడంతోపాటు వాటిని పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా అభివృద్ధి చేసేలా టీఎస్ఐఐసీ ద్వారా కృషి చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా 109 ఇండస్ట్రియల్ పార్క్లను ఏర్పాటు చేయగా, వచ్చే ఐదేండ్లలో మరో 70కి ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటన్నింటికి పర్యావరణ అనుమతులు తప్పనిసరి. ఈ నేపథ్యంలో టీఎస్ఐఐసీ పంపిన మూడు ఇండస్ట్రియల్ పార్క్ల ప్రతిపాదనలకు అనుమతులు వచ్చాయి.
పర్యావరణ అనుమతులు లభించిన ఇండస్ట్రియల్ పార్క్లలో నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు, హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ట నర్సింగాపురంలలోని ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్లున్నాయి. అలాగే మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ అర్బన్ మండలం పరిధిలోని దివిటిపల్లిలోని ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఉన్నది. కాగా, ఆన్లైన్ ద్వారా భూములను పరిశ్రమలకు కేటాయించేందుకు టీఎస్ఐఐసీ సన్నాహాలు చేస్తున్నది.
మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ అర్బన్ మండల పరిధిలోని దివిటిపల్లిలో 377.65 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్. ఇందులో 137.79 ఎకరాలు పరిశ్రమల కోసం వినియోగించనున్నారు.
ఈ రెండు పార్క్ల్లో డెయిరీ, పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, పాలపొడి, ఐస్క్రీమ్ల తయారీ, మాంసం,
ఆక్వా ఉత్పత్తుల ప్రాసెసింగ్, పిండి, బియ్యం, పప్పు ధాన్యాలు, పసుపు, కారం మిల్లింగ్ తదితర పరిశ్రమలుంటాయి.
ఎలక్ట్రానిక్, మొబైల్స్ విడిభాగాలు, కార్బన్, లిక్విడ్ హైడ్రోజన్ల ముడి సరుకు ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీలు, వాటి విడిభాగాలు, డ్రోన్లు, మొబైల్ ఫోన్ల అసెంబ్లింగ్ తదితర కంపెనీలకు అనుమతులు.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ విస్తీర్ణం 466.11 ఎకరాలు. ఇందులో 264.22 ఎకరాలు పరిశ్రమల కోసం కేటాయించాలని నిర్ణయించారు.
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ట నర్సింగాపురంలో తేనున్న ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ విస్తీర్ణం 242.71 ఎకరాలు. 117.46 ఎకరాలను పరిశ్రమల కోసం ఇవ్వనున్నారు.
ఈ ఇండస్ట్రియల్ పార్కుల్లో పరిశ్రమలకు కేటాయించగా మిగిలిన భూముల్లో రోడ్లు, పచ్చదనంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 2014 నుండి ఈ ఏడాది మే వరకు వివిధ ఇండస్ట్రియల్ పార్క్లలో 7,806 ఎకరాల స్థలాన్ని 3,680 సంస్థలకు కేటాయించింది. ఇకడ ప్రారంభమైన పరిశ్రమల ద్వారా 2,63,222 మందికి ఉద్యోగ-ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అలాగే పరిశ్రమలకు కావాల్సిన అన్ని అనుమతులను సులభతరం చేసేందుకు టీఎస్ ఐ-పాస్ను తెచ్చిన సంగతి విదితమే. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మే వరకు 23,065 యూనిట్లకు అనుమతులు మంజూరయ్యాయి. రూ.2,61, 732 కోట్ల పెట్టుబడితో ఆయా జిల్లాల్లో వివిధ సంస్థలు తమ కార్యకలాపాల్ని ప్రారంభించాయి. వీటి ద్వారా మొత్తం 15,74,798 ఉద్యోగ-ఉపాధి అవకాశాలు వచ్చాయి. మరో 18,587 యూనిట్లకు సంబంధించి అనుమతుల కోసం దరఖాస్తులు రావడం జరిగింది. ఇవి కూడా ప్రారంభమైతే మరో రూ.1,54, 690 కోట్ల పెట్టబడులు, 9,13,386 ఉద్యోగావకాశాలు రానున్నాయి.