FIEO | న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశీయ ఎగుమతుల్ని ప్రభావితం చేయవచ్చని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తకర పరిస్థితులు.. అంతర్జాతీయ మార్కెట్లోని డిమాండ్ను దెబ్బ తీయవచ్చని ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ అభిప్రాయపడ్డారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం.. అంతర్జాతీయ అనిశ్చితికి దారి తీసిందని, ఇప్పటికే గత ఆర్థిక సంవత్సరం (2023-24) భారతీయ ఎగుమతులు తగ్గాయని గుర్తుచేశారు.
అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే దిగుమతులు 3.11 శాతం పడిపోయి 437 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. దిగుమతులూ 8 శాతం పతనమై 677.24 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తాజాగా తెలియజేశారు. ‘అంతర్జాతీయ మార్కెట్లో ఈ రకమైన విపత్కర పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. తప్పక డిమాండ్ పడిపోతుంది. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికం గణాంకాల్లోనే అది కనిపించవచ్చు’ అని అజయ్ సహాయ్ అన్నారు. కాగా, భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులతోపాటు అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన వడ్డీరేట్లు కూడా డిమాండ్ మందగమనానికి కారణమేనని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో ఐరోపా దేశాల్లో ఈ మందగమనం తీవ్రత ఎక్కువగా ఉండొచ్చన్నారు.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రభావంపై అజయ్ మాట్లాడుతూ.. భారత్ నుంచి యూఏఈ, ఇరాన్లకు వెళ్లే ఇంజినీరింగ్ ఉత్పత్తులకు డిమాండ్ పడిపోవచ్చని చెప్పారు. ఆభరణాల ఎగుమతులకూ ఇబ్బందేనన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ రంగాల్లోని వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు ద్రవ్యపరమైన దన్నునివ్వాలన్నారు. ప్రధానంగా ఎగుమతిదారులకు వడ్డీ రాయితీలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలావుంటే భారత్ నుంచి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, టెలీకమ్యూనికేషన్, మెషినరీ, ఆటో, ఫార్మా, మెడిసిన్, డయాగ్నోస్టిక్స్ వంటి సాంకేతిక, నైపుణ్య ఆధారిత రంగాల ఎగుమతులు 2030 నాటికి లక్ష కోట్ల డాలర్ల మార్కును తాకగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే దుస్తులు, పాదరక్షలు, రత్నాలు-ఆభరణాల వంటి కార్మిక శక్తి ఆధారిత రంగాల వాటా దేశీయ ఎగుమతుల్లో పడిపోతున్నదని ఒకింత ఆందోళన వెలిబుచ్చారు.