Gold Price | మదుపరుల ఇంట పసిడి కాంతులు విరజిమ్మాయి. బంగారంపై పెట్టుబడులు ఈ ఏడాది 13 శాతం రాబడు లను అందించాయి. ఎఫ్డీ, పీపీఎఫ్, ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు పథకాల్ని మించి ఇన్వెస్టర్లకు పుత్తడి ప్రత్యామ్నాయంగా నిలిచింది.
హైదరాబాద్, డిసెంబర్ 30: బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరుల పంట పండింది. 2023లో పసిడి ధరలు ఏకంగా 13 శాతం ఎగిసాయి. సురక్షిత పెట్టుబడి సాధనాలుగా పేరున్న ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ప్రభుత్వ భరోసాగల ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలను మించి గోల్డ్ రిటర్న్స్ ఉండటం గమనార్హం. అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం, అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక అనిశ్చిత పరిస్థితులు, ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధానం నడుమ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది తీవ్ర ఒడిదుడుకులకు లోనైన విషయం తెలిసిందే. దీంతో మదుపరులు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లించారు. ఈ పరిణామాలే మార్కెట్లో పసిడి రాబడులను మరింత పెంచాయి.
ఈ ఏడాది తులం మేలిమి (24 క్యారెట్) బంగారం మునుపెన్నడూ లేనివిధంగా ఆల్టైమ్ హై రికార్డు స్థాయిని తాకుతూ రూ.64,460 పలికింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ వంటి ప్రధాన సూచీలు పంచిన ప్రతిఫలాలు సైతం దాదాపుగా వెలవెలబోయే పరిస్థితే నెలకొన్నది. నిజానికి దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ నవంబర్, డిసెంబర్ నెలల్లోనే పరుగులు పెట్టాయి. వచ్చే ఏడాది వడ్డీరేట్ల కోతలపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇస్తున్న సంకేతాలే ఇందుకు కారణం. అందువల్లే ఈక్విటీ ఇన్వెస్టర్లకు ఈసారి చెప్పుకోదగ్గ లాభాలు వచ్చిపడ్డాయి. లేకపోతే టాప్ ప్లేస్ రిటర్న్స్ జాబితాలో బంగారంపై పెట్టుబడులేనని మెజారిటీ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు గ్లోబల్ మార్కెట్లోనూ ఔన్సు పుత్తడి విలువ ఏకంగా 2,148 డాలర్లకు చేరడం విశేషం. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఏడాది 800 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఇది కూడా గోల్డ్ మార్కెట్కు కలిసొచ్చింది. ఇక ఈ ఏడాది అక్షయ తృతీయ, ధనత్రయోదశి ఇతరత్రా పండుగల్లో బంగారం అమ్మకాలు సైతం ఆశాజనకంగా సాగాయి.
2024లో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేటు ఏకంగా రూ.67,000ను తాకవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది దూకుడు.. వచ్చే ఏడాది కూడా కొనసాగగలదన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ సైతం మదుపరులు తమ పోర్ట్ఫోలియోలో బంగారానికి 10-15 శాతం పెట్టుబడుల్ని కేటాయించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఏడాది గోల్డ్ లోన్స్కు కూడా విపరీతమైన డిమాండ్ ఉండవచ్చని చెప్తున్నారు. ఇదిలావుంటే మరికొందరైతే తులం రూ.72,000లకు వెళ్లవచ్చని అంచనా వేస్తుండటం గమనార్హం.