ముంబై, ఫిబ్రవరి 21: ఆర్థిక సంక్షోభంలో అల్లాడుతున్న ఎడ్టెక్ దిగ్గజం బైజూస్కు ఊరట లభించింది. కంపెనీ ప్రతిపాదించిన 200 మిలియన్ డాలర్ల (రూ.1,660 కోట్లు) రైట్స్ ఇష్యూ పూర్తిగా సబ్స్క్రయిబ్ అయ్యింది. బైజూస్ ప్రమోటింగ్ సంస్థ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ అత్యంత తక్కువ విలువకు ప్రస్తుత షేర్హోల్డర్లకు రైట్స్ షేర్లను ఆఫర్ చేసింది.
ఒకానొక సమయంలో 22 బిలియన్ డాలర్ల గరిష్ఠస్థాయికి కంపెనీ విలువ చేరినప్పటికీ, దానికి 99 శాతం తక్కువ విలువతో రైట్స్ జారీచేసింది. తమ షేర్హోల్డర్లందరూ రైట్స్ ఇష్యూలో పాలుపంచుకున్నారని బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈవో బైజూ రవీంద్రన్ తెలిపారు. రైట్స్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీని నియమించనున్నట్టు వెల్లడించారు. ప్రమోటర్లు మినహా ఇతర షేర్హోల్డర్లకు కంపెనీలో 30 శాతం వాటా ఉంది.
ఈజీఎంపై స్టేకు హైకోర్టు నిరాకరణ
పలు అవకతవకలకు పాల్పడిన బైజూస్ సీఈవో రవీంద్రన్, ఆయన కుటుంబాన్ని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించేందుకు కొంతమంది థింక్ అండ్ లెర్న్ ఇన్వెస్టర్లు డిమాండ్ మేరకు ఫిబ్రవరి 23న జరగనున్న ఈజీఎంపై స్టే విధించేందుకు కర్నాటక హైకోర్టు బుధవారం నిరాకరించింది. ఈజీఎంపై స్టేను కోరుతూ బైజూస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈజీఎంలో ఆమోదించిన ఎటువంటి తీర్మానాన్ని అయినా తదుపరి విచారణలోగా అమలు చేయరాదని కోర్టు ఆదేశించి ప్రమోటర్లకు కొంత ఊరటనిచ్చింది.