న్యూఢిల్లీ, నవంబర్ 17: కార్ల సంస్థలకు ఈ పండుగ సీజన్ కలిసొచ్చింది. ఈ సీజన్లో ప్యాసింజర్ వాహన విక్రయాలు తొలిసారిగా పది లక్షల మార్క్ను అధిగమించాయి. సెమికండక్టర్ల కొరత తీరడంతో ఆటోమొబైల్ సంస్థలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుకోవడం ఇందుకు కారణమని ఆటోమొబైల్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత పండుగ సీజన్(ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్) నెలల్లో అత్యధికంగా 11.38 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఒక పండుగ సీజన్లో ఇంతటి స్థాయిలో అమ్ముడవడం ఇదే తొలిసారి. ఆగస్టు 17న(ఓనం) ప్రారంభమైన పండుగ సీజన్ నవంబర్ 15(భాయ్ దూజ్)న ముగిసింది. ఏడాది క్రితం ఇదే సీజన్లో అమ్ముడైన 8.10 లక్షల యూనిట్ల కార్లు, యుటిలిటీ, సెడాన్ వాహనాలతో పోలిస్తే 41 శాతం ఎగబాకాయి.
దేశీయంగా అమ్ముడవుతున్న ప్యాసింజర్ వాహనాల్లో మారుతి సుజుకీకి చెందినవే అధికంగా ఉన్నాయి. 2020, 2022, 2023ల్లో సంస్థ వరుసగా 4.71 లక్షలు(ఏడాది ప్రాతిపదికన 36 శాతం వృద్ధి), 3.40 లక్షల యూ నిట్లు(2.2 శాతం వృద్ధి), 4.90 లక్షల యూ నిట్లు(44 శాతం వృద్ధి) నమోదయ్యాయి.
పండుగ సీజన్లో తొలిసారిగా పది లక్షల వాహన విక్రయాల మార్క్ దాటింది. గతంలో 2020లో 9.34 లక్షల యూనిట్ల రికార్డు మరుగునపడిపోయింది. చిప్ల కొరత తీరడంతో మాడళ్ల కోసం వేచివుండే సమయం తగ్గనున్నది.
– శశాంక్ శ్రీవాత్సవ, మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి