ముంబై, జూన్ 30: వరుస లాభాల్లో దూసుకుపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం అదరగొట్టాయి. మదుపరులు పెట్టుబడులతో కదం తొక్కడంతో గత రికార్డులన్నీ చెరిగిపోయాయి. అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ ఆల్టైమ్ హైని తాకాయి. ఉదయం ఆరంభం నుంచే దూకుడు మీదున్న మార్కెట్లు.. సమయం గడుస్తున్నకొద్దీ పెరుగుతూపోయాయి. ఈ క్రమంలోనే చివరకు సెన్సెక్స్ 803.14 పాయింట్లు లేదా 1.26 శాతం ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగా 64వేల మార్కుకు ఎగువన 64,718.56 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 853.16 పాయింట్లు పుంజుకుని 64,768.58 వద్దకు చేరి సరికొత్త ఇంట్రా-డే హైని నెలకొల్పింది. నిఫ్టీ సైతం 216.95 పాయింట్లు లేదా 1.14 శాతం ఎగబాకి తొలిసారి 19వేల స్థాయిని అధిగమించి 19,189.05 వద్ద నిలిచింది. ఇంట్రా-డేలోనూ 229.6 పాయింట్లు అందుకుని 19,201.7 వద్దకు వెళ్లింది.
బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో నమోదైన సంస్థల మార్కెట్ విలువ లైఫ్టైమ్ హైకి వెళ్లింది. వరుసగా మూడు రోజులు మార్కెట్లు లాభాల్లో కదలాడిన నేపథ్యంలో మదుపరుల సంపద ఏకంగా రూ.296.48 లక్షల కోట్లను తాకింది. ఈ మూడు రోజుల్లో రూ.5,80,740.05 కోట్లు ఎగిసి రూ.2,96,48,153.59 కోట్లకు చేరింది. దీంతో ఇంతకుముందున్న రూ.294.36 లక్షల కోట్ల రికార్డు కనుమరుగైపోయినైట్టెంది.