ముంబై, జూన్ 8: రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయం స్టాక్ మార్కెట్లకు రుచించలేదు. వరుసగా నాలుగోరోజు బుధవారం సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు నిధుల ఉపసంహరణ కొనసాగుతుండటం, క్రూడాయిల్ మరింత పెరగడం మదుపరుల్లో సెంటిమెంట్ను నిరాశపరిచింది. ఆర్బీఐ సమీక్ష ప్రకటించగానే సూచీలు ఒక్కసారిగా కుదుపునకు గురయ్యాయి. ఒక దశలో 500 పాయింట్లకు పైగా పతనమైన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 214.85 పాయింట్లు తగ్గి 54,892.49 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 60.10 పాయింట్లు పతనం చెంది 16,356.25 వద్ద ముగిసింది.
ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. ముఖ్యంగా వడ్డీరేట్లు మరింత పెరగనుండటంతో బ్యాంకింగ్ రంగ సూచీతోపాటు రియల్ ఎస్టేట్ రంగ షేర్లు కూడా కుదేలయ్యాయి. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో ఈ సమీక్షలో వడ్డీరేట్లను పెంచుతుందన్న అంచనాలకు తగ్గట్టుగానే నిర్ణయం తీసుకున్నప్పటికీ మదుపరులకు ఈ నిర్ణయం రుచించలేదు.