PM Modi | న్యూఢిల్లీ, డిసెంబర్ 25: కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు కొలువుదీరిన దగ్గర్నుంచి ఇప్పటిదాకా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)ల్లో పెట్టుబడుల ఉపసంహరణల విలువ రూ.4,30,336 కోట్లుగా ఉన్నది. నిజానికి ఈ పదేండ్లలో సర్కారీ కంపెనీల్లో వాటాల అమ్మకం ద్వారా కేంద్రం సమీకరించాలనుకున్నది రూ.9,42,925 కోట్లు. అయితే ఉద్యోగ-కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత, ఆశించిన స్థాయిలో కొనుగోలుదారుల నుంచి స్పందన లేకపోవడం, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు ఇతరత్రా పరిస్థితులు అనుకూలించకపోవడంతో దాదాపు సగానికే పరిమితం కావాల్సి వచ్చింది.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణే ధ్యేయంగా అడుగులేసిన మోదీ సర్కారు.. ఎయిర్ ఇండియా, ఎన్ఐఎన్ఎల్ తదితర కంపెనీలను అమ్మేసి తమ పంతం నెరవేర్చుకున్నది. అయితే ప్రభుత్వ అధీనంలో నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఎన్ఐఎన్ఎల్)లను టాటా గ్రూప్ చేజిక్కించుకోగా, ఇప్పుడవి నిలకడగా రాణిస్తూ లాభాల బాట పడుతుండటం గమనార్హం. నిరుడు జూలైలో రూ.12,100 కోట్లకు ఎన్ఐఎన్ఎల్ను టాటా స్టీల్ లాంగ్ ప్రోడక్ట్స్ కొన్నది. అయితే ఈ ఏప్రిల్-సెప్టెంబర్లో ఆ సంస్థ రూ.3,000 కోట్ల రెవిన్యూను సాధించడం విశేషం. ప్రభుత్వం పట్టించుకోక పాములు, తేళ్లకు ఆవాసమై.. చెట్ల మధ్య తుప్పు పట్టిపోయిన యంత్రాలతో కళావిహీనంగా మారిన ఎన్ఐఎన్ఎల్ ప్లాంట్ను కేవలం 90 రోజుల్లోనే టాటాలు పునరుద్ధరించడం కొసమెరుపు.
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్ లేదా వైజాగ్ స్టీల్), ఐడీబీఐ అమ్మకాలు కేంద్ర ప్రభుత్వానికి సాధ్యపడట్లేదు. ఆశించిన స్థాయిలో ఆదరణ లేకున్నా ఎయిర్ ఇండియాను ఎలాగోలా అమ్మేసిన మోదీ సర్కారుకు.. వైజాగ్ స్టీల్ విక్రయం విషయంలో కార్మికుల నుంచి భారీగా నిరసన సెగ తాకుతున్నది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇక ఆ సంస్థ జోలికి మోదీ సర్కారు వెళ్లదనే అనుకోవచ్చు. అలాగే ఐడీబీఐ బ్యాంక్ సేల్ విషయంలోనూ చివరకు ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ సాయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ బ్యాంక్ ప్రైవేటీకరణకు ప్రభుత్వ నిబంధనలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతులు అడ్డంకిగా ఉంటున్నాయి. దీంతో ఇప్పుడప్పుడే ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ కూడా లేనట్టేనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.