Stock Markets | ముంబై, ఆగస్టు 4: వరుసగా మూడు రోజులపాటు భారీ నష్టాల్ని చవిచూసిన మార్కెట్ శుక్రవారం అంతర్జాతీయ సానుకూల సంకేతాల కారణంగా కొంతవరకూ కోలుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ 480 పాయింట్ల లాభంతో 65,721పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేరీతిలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 135 పాయింట్ల పెరిగి 19,517 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే సెన్సెక్స్ 439 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్ల చొప్పున నష్టపోయాయి.
ఇటీవలి పతనంతో కనిష్ఠధరల్లో లభిస్తున్న ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేయడంతో తాజాగా మార్కెట్ కోలుకున్నదని రిలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ అజిత్ మిశ్రా తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ డౌన్గ్రేడ్చేయడంతో ప్రపంచట్రెండ్కు అనుగుణంగా కొద్దిరోజులు భారత్ సూచీలు క్షీణించాయని, మరోవైపు ఇండియా మార్కెట్ను మోర్గాన్స్టాన్లీ అప్గ్రేడ్ చేయడంతో ఈక్విటీలు రిలీఫ్ ర్యాలీ జరిపాయని కొటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అమోల్ అథేవాలా చెప్పారు.
ఐటీ జోరు
వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ అత్యధికంగా 1.47 శాతం పెరిగింది. టెలికమ్యునికేషన్స్ సూచి 1.45 శాతం, టెక్నాలజీ సూచి 1.39 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 0.83 శాతం, బ్యాంకెక్స్ 0.66 శాతం చొప్పున పెరిగాయి. ఎఫ్ఎంసీజీ 0.85 శాతం, కమోడిటీస్ సూచి 0.56 శాతం చొప్పున పెరిగాయి. ఆటోమొబైల్, యుటిలిటీస్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ ఇండెక్స్లు నష్టపోయాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.66 శాతం, మిడ్క్యాప్ సూచి 0.65శాతం చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్-30 షేర్లలో అత్యధికంగా ఇండస్ఇండ్ బ్యాంక్ 3.25 శాతం పెరగ్గా, తాజాగా ఆర్థిక ఫలితాల్ని వెల్లడించిన ఎస్బీఐ షేరు 2.94 శాతం నష్టపోయింది. పెరిగిన షేర్లలో టెక్ మహీంద్రా, విప్రో, భారతి ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్లు ఉన్నాయి. మరోవైపు ఎస్బీఐ, ఎన్టీపీసీ, మారుతి, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్, పవర్గ్రిడ్లు తగ్గాయి.