Stock Market | ముంబై, ఫిబ్రవరి 19: స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదోరోజూ లాభాల్లో ముగిశాయి. ఆర్థిక సేవలు, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లకు లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మార్కెట్లకు మరింత కిక్కునిచ్చాయి. బెంచ్మార్క్ ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ మరో 281 పాయింట్లు అధికమవగా, జాతీయ సూచీ నిఫ్టీ చారిత్రక గరిష్ఠ స్థాయికి ఎగబాకింది.
మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 281.52 పాయింట్లు ఎగబాకి 72,708.16 పాయింట్లకు చేరుకున్నది. ఒక దశలో 72,881.93 పాయింట్లను తాకింది. చివరకు ఈ భారీ లాభాలను నిలుపుకోలేకపోయింది. 30 సూచీల్లో 17 సూచీలు లాభపడగా, 13 షేర్లు నష్టపోయాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ మరో శిఖరాగ్రానికి చేరుకున్నది. 81.55 పాయింట్లు అధికమై 22,122.25 పాయింట్లకు చేరుకున్నది. ఈ స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి. ఇంట్రాడేలో 22,186 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. ఫార్మా, బ్యాంకింగ్, చమురు రంగ షేర్లకు లభించిన మద్దతుతో నిఫ్టీ ఆల్టైం హైకీ చేరుకున్నది.
స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీతో మదుపరుల సంపద కూడా అంతకంతకు పెరుగుతున్నది. సోమవారం మదుపరుల సంపద మరో రూ.2,19,581.56 కోట్లు మేర పెరిగింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రికార్డు స్థాయి రూ.391.69 లక్షల కోట్లు లేదా 4.72 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నది. రికార్డు స్థాయికి చేరుకున్న మార్కెట్ క్యాప్ భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉన్నదని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.