ముంబై, అక్టోబర్ 10: దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. ఆర్థిక, వాహన ,ఐటీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు ఒక్క శాతం వరకు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు కూడా మార్కెట్లను మరింత ముందుకు తీసుకెళ్లాయి. ప్రారంభం నుంచి లాభాలబాట పట్టిన సూచీలు చివరి వరకు ఇదే ట్రెండ్ను కొనసాగించాయి.
మార్కెట్ ముగిసే సమయానికి 566.97 పాయింట్లు పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ మళ్లీ 66 వేల మార్క్ను అధిగమించింది. చివరకు 66,079.36 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ 177.50 పాయింట్లు అందుకొని 19,689.85 వద్ద ముగిసింది. అమెరికా బాండ్ ఈల్డ్ తగ్గినప్పటికీ వడ్డీరేట్లు మరికొంతకాలం యథాతథంగా ఉండే అవకాశం ఉండటంతో మదుపరులు భారీగా నిధులు కుమ్మరించారు.