Elon Musk : టెస్లా బాస్ ఎలన్ మస్క్ ఈ నెలాఖరులో భారత్ పర్యటనకు రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం నేపధ్యంలో మస్క్ భారత్లో తన పెట్టుబడి ప్రణాళికలను వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఢిల్లీలో ఏప్రిల్ 22న ప్రధాని నరేంద్ర మోదీతో సంప్రదింపులు జరుపుతారని ఓ వార్తాసంస్ధ పేర్కొంది. తన పర్యటనలో భాగంగా భారత్లో టెస్లా ప్రణాళికలకు సంబంధించిన వివరాలను కూడా మస్క్ వెల్లడిస్తారని భావిస్తున్నారు.
అయితే భారత్లో మస్క్ పర్యటనకు సంబంధించి తుది అజెండా ఇంకా ఖరారు కాలేదని చెబుతున్నారు. భారత్లో తయారీ ప్లాంట్ ఏర్పాటు కోసం టెస్లా అధికారులు అనువైన స్ధలాల కోసం అన్ఏవషణ సాగిస్తున్నారు. భారత్లో మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కోసం టెస్లా 2 బిలియన్ డాలర్లు వెచ్చిస్తుందని తొలుత వార్తలు వచ్చాయి. అత్యాధునిక తయారీ కేంద్రం స్ధాపనకు అనువైన ప్రదేశం కోసం కంపెనీ చురుకుగా కసరత్తు సాగిస్తోంది. మస్క్ పర్యటన నాటికి ఈ కసరత్తు కొలిక్కివచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
టెస్లా ప్లాంట్ కోసం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు అనువైన స్ధలాలను ఆఫర్ చేశాయి. టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రపంచ మార్కెట్లకు సరఫరా చేసేందుకు అనుగుణంగా భారత్లో తయారీ ప్లాంట్ను నెలకొల్పేందుకు టెస్లా సన్నద్ధమైంది. భారత్లో టెస్లా ఎంట్రీతో దేశ ఆర్ధిక వ్యవస్ధ, పెట్టుబడి వాతావరణానికి ఊతమిస్తుందని భావిస్తున్నారు. మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు, భారత్ నుంచి ఆటో విడిభాగాల సేకరణతో దేశీయంగా ఉపాధి అవకాశాలు పెరిగి, వేగవంతమైన ఆర్ధిక వృద్ధికి బాటలు పడనున్నాయి.
Read More :