Tesla | ఎలన్ మస్క్ సారధ్యంలోని టెస్లా ఎలక్ట్రిక్ కార్లు త్వరలో భారత్ మార్కెట్లోకి రానున్నాయని తెలుస్తోంది. 2024 జనవరి నాటికి టెస్లాకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించారని తెలుస్తున్నది. టెస్లాతోపాటు ఇతర పెట్టుబడిదారులకు దేశంలో సంబంధిత ఉత్పత్తుల తయారీ యూనిట్ల ఏర్పాటుకు వేగంగా అనుమతులు ఇవ్వాలనే విషయమై చర్చ జరిగిందని సమాచారం.
ఇంతకుముందు దిగుమతి సుంకం తగ్గించడానికి కేంద్రం ససేమిరా అనడంతో భారత్ మార్కెట్లోకి టెస్లా కార్లు ప్రవేశించలేదు. భారత్ లో దిగుమతి సుంకాలు ఎక్కువ అని, సుంకాలు తగ్గించాలని ఎలన్ మస్క్, టెస్లా ప్రతినిధులు కోరినప్పుడు.. దేశీయంగా ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తే పరిశీలిస్తామని కేంద ప్రభుత్వ అధికారులు తేల్చి చెప్పారు.
కానీ, గత జూన్లో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ప్రధాని నరేంద్రమోదీతో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ సమావేశమయ్యారు. నాటి నుంచి భారత్ మార్కెట్లోకి టెస్లా కార్లను తీసుకొచ్చే పనులు ముమ్మరం అయ్యాయి. ఇందులో భాగంగా భారత్ లో కార్లు, బ్యాటరీల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి కేంద్రంతో టెస్లా ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. 2024 జనవరిలో కేంద్రం అనుమతులు ఇస్తే.. వీలైనంత త్వరగా భారత్ మార్కెట్లోకి టెస్లా కార్లు రానున్నాయని సమాచారం.