భారత్లో కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ సిద్ధం అవుతున్నది. దేశీయంగా అత్యంత చౌక ధరకే అందుబాటులోకి తేవడంతోపాటు విదేశాలకు ఎగుమతి చేయాలని తలపోస్తున్నది. విదేశాల నుంచి దిగుమతి కార్లపై సుంకాలు తగ్గించాలన్న టెస్లా యాజమాన్యం ప్రతిపాదనను ఇంతకుముందే తిరస్కరించిన కేంద్రం.. దేశీయంగా వాటిని తయారు చేయాలని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టెస్లా మేనేజ్ మెంట్ తన వైఖరి మార్చుకున్నట్లు తెలుస్తున్నది. త్వరలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్తో టెస్లా ప్రతినిధులు సమావేశం కానున్నారని సమాచారం.
గత నెలలో అమెరికాలో ప్రధాని నరేంద్రమోదీతో టెస్లా అధినేత ఎలన్ మస్క్ సమావేశమై.. భారత్ లో గణనీయంగా పెట్టుబడులు పెడతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్లో నిర్మించే కారు రమారమీ రూ.20 లక్షల (24 వేల డాలర్ల) ధరకే అందుబాటులోకి తేవాలని టెస్లా భావిస్తున్నట్లు రాయిటర్స్ ఓ వార్తా కథనం ప్రచురించింది.
ప్రస్తుతం చైనాలో తయారవుతున్న మోడల్3 సెడాన్ కారు ధర 32 వేల డాలర్లు.. దానికంటే 25 శాతం తక్కువ ధరకే భారత్లో టెస్లా కారు తయారు కానున్నది. అందుకోసం కొత్త మోడల్ కారును టెస్లా సిద్ధం చేయనున్నట్లు తెలుస్తున్నది. దీనిపై అధికారికంగా స్పందించడానికి టెస్లా ప్రతినిధులు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం భారత్ కార్ల మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా రెండు శాతం లోపే. ప్రపంచవ్యాప్త కార్ల మార్కెట్లో భారత్కు మూడో స్థానం.