Tesla | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా (Tesla)’ భారత్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యేందుకు మార్గం సుగమం అవుతోంది. భారత్లో 200 కోట్ల డాలర్ల (రూ.16,600 కోట్లు) పెట్టుబడులతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. అయితే తమ సంస్థ కార్యకలాపాల నిర్వహణకు రెండేండ్ల పాటు తమ కార్ల దిగుమతిపై సుంకం 15 శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి షరతు విధించినట్లు ఒక ఆంగ్ల దినపత్రికలో వార్తా కథనం ప్రచురితమైంది.
40 వేల డాలర్ల పై చిలుకు ధర గల కార్ల దిగుమతిపై 100 శాతం, అంతకంటే తక్కువ ధర గల కార్లపై 70 శాతం దిగుమతి సుంకం విధిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. భారత్ మార్కెట్లోకి టెస్లా కార్లను అనుమతించేందుకు 15 శాతం దిగుమతి సుంకం తగ్గించడానికి అనుసరించాల్సిన విధి విధానాలపై గత ఆగస్టు నుంచి కసరత్తు చేస్తున్నది. అదీ కూడా స్థానికంగా కార్ల తయారీ ప్రారంభిస్తేనే దిగుమతి సుంకం తగ్గిస్తామని కేంద్రం కూడా చెప్పినట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం ఒకవేళ 12వేల వాహనాలపై దిగుమతి సుంకం తగ్గిస్తే 500 మిలియన్ డాలర్లు (రూ.4,400 కోట్లు), 30 వేల వాహనాలపై దిగుమతి సుంకం తగ్గిస్తే 200 కోట్ల డాలర్లు (రూ.16,600 కోట్లు) పెట్టుబడులు పెడతామని టెస్లా వర్గాలు చెబుతున్నాయి. 200 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టడానికి టెస్లా చేసిన ప్రతిపాదన ఆచరణ యోగ్యమా? లేదా? అన్న విషయమై కేంద్రం పరిశీలిస్తున్నది. రూ.16,600 కోట్ల విలువైన పెట్టుబడులు దేశీయంగా పెడితే ఆయా కార్లపై దిగుమతి సుంకం దిగి వస్తుందని కేంద్రం యోచిస్తున్నది.
టెస్లా కార్లను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు దిగుమతి సుంకం తగ్గింపు విషయమై కేంద్రం, ఆ కార్ల తయారీ సంస్థ ప్రతినిధులు సంప్రదిస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ అంతర్గత వాణిజ్యం, పరిశ్రమల విభాగం, భారీ పరిశ్రమలశాఖ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ అధికారులు, టెస్లా ప్రతినిధులు ఈ విషయమై స్పందించేందుకు నిరాకరించారు.