Tesla To Hold Entry India | టెస్లా సీఈవో ఎలన్మస్క్.. ప్రపంచంలో విద్యుత్ కార్ల తయారీ అగ్రశ్రేణి సంస్థ టెస్లా.. అంతర్జాతీయంగా అతిపెద్ద మార్కెట్ భారత్ది.. మనదేశ మార్కెట్లోకి ఎంటర్ కావాలని శతవిధాల ప్రయత్నించారు ఎలన్మస్క్. అయితే, దిగుమతి చేసుకున్న కార్లు, ఇతర వాహనాలపై సుంకాలు ఇబ్బడి ముబ్బడిగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ దిగుమతి సుంకాలను తగ్గించాలని దాదాపు ఏడాదిన్నరగా టెస్లా ఇండియా బృందం.. కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారత్లోకి ఎంటర్ కావాలన్న ప్లాన్లకు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు టెస్లా ప్రకటించింది.
అమెరికా లేదా చైనా నుంచి దిగుమతి చేసుకునేందుకు అనుమతించాలని టెస్లా ఇంతకుముందు కోరింది. ప్రయోగాత్మకంగా తొలుత తాము ఈ రెండు దేశాల నుంచి దిగుమతి చేసి విక్రయించే కార్లపై సుంకాలు తగ్గించాలని పదేపదే విజ్ఞప్తి చేసింది టెస్లా. స్వయంగా టెస్లా సీఈవో ఎలన్ మస్క్.. కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. కానీ కేంద్రం ససేమిరా అంది. టెస్లా కార్లపై దిగుమతి సుంకాలు తగ్గిస్తే, మిగతా సంస్థలకు అన్యాయం చేసినట్లవుతుందని స్పష్టం చేసింది. భారత్లో కార్ల తయారీ ద్వారా.. కనీసం కొన్ని విడి భాగాల ఉత్పత్తిని ప్రారంభించాలని.. అప్పుడే సుంకాలు తగ్గించడం సాధ్యం అని తెగేసి చెప్పింది కేంద్రం.
భారత్లో ఎంట్రీ కోసం గత ఫిబ్రవరి ఒకటో తేదీని టెస్లా యాజమాన్యం గడువు నిర్దేశించుకున్నది. రాయితీలకు కేంద్రం ససేమిరా అన్నా.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తదితర ప్రధాన నగరాల్లో షోరూమ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాల కోసం అన్వేషణ సాగించింది టెస్లా. ఇప్పుడు దేశంలోని వివిధ నగరాల్లో షోరూమ్ల నిర్మాణ ప్రతిపాదనను కూడా పక్కన బెట్టింది. దీనిపై స్పందించడానికి టెస్లా అందుబాటులోకి రాలేదు.