Tesla | అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’.. భారత్ మార్కెట్లోకి త్వరలో ఎంటర్ కానున్నది. ఇందుకోసం ఈ ఏడాది నుంచి రూ.15,76,461 కోట్ల (190 కోట్ల డాలర్ల) విలువ గల విడి భాగాలను భారత్లోనే తయారు చేయనున్నదని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. బుధవారం ఆయన ఓ ఆటోమొబైల్ సదస్సులో మాట్లాడుతూ ఇప్పటికే టెస్లా భారత్లో 100 కోట్ల డాలర్ల విలువైన విడి భాగాలను వినియోగిస్తున్నదని అన్నారు. 2030 నాటికి ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కొనుగోలు చేయడం తప్పనిసరి అవుతుందన్నారు.
2021లో తొలిసారి భారత్ మార్కెట్లోకి రావడానికి టెస్లా ప్రయత్నించింది. అందుకోసం దిగుమతి కార్లపై సుంకం 100 శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తేవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గతేడాది టెస్లా, భారత ప్రభుత్వ అధికారుల మధ్య చర్చలు జరిగాయి. భారత్ మార్కెట్లోకి ఎంటర్ కావాలంటే దేశీయంగా కార్ల తయారీకి ముందుకు రావాల్సిందేనని టెస్లా ప్రతినిధులకు కేంద్రం తేల్చి చెప్పింది.
ఇటీవల అమెరికాలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించినప్పుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఆయనతో సమావేశమయ్యారు. భారత్ మార్కెట్లోకి ఎంటర్ కావడానికి ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు. భారత ప్రభుత్వాధికారులతోనూ ఇటీవల సమావేశమైన టెస్లా ప్రతినిధులు.. స్థానికంగా టెస్లా కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. అదే జరిగితే ప్రస్తుత టెస్లా ఎంట్రీ మోడల్ కారు కంటే 25 శాతం చౌకగా, సుమారు 24 వేల డాలర్లకే అందుబాటులోకి వస్తుంది. విదేశాలకు చౌక ధరకే ఎగుమతి చేయొచ్చునని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
టెస్లా సీనియర్ పబ్లిక్ పాలసీ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ రోహన్ పటేల్.. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. జూన్లో ఎలన్ మస్క్తో ప్రధాని మోదీ చర్చల పురోగతిని ముందుకు తీసుకెళ్లేందుకు రోహన్ పటేల్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే, అమెరికా తర్వాత టెస్లాకు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మాన్యుఫాక్చరింగ్ యూనిట్ షాంఘైలో ఉంది. బెర్లిన్, మెక్సికోల్లో కూడా కొత్త ప్లాంట్లు ఉన్నాయి.