Tesla gets Ministries Support | భారత మార్కెట్లోకి ఎంటరయ్యేందుకు గ్లోబల్ ఎలక్ట్రిక్ దిగ్గజం టెస్లాకు మార్గం సుగమం అవుతుందా.. భారత్లో భారీగా ఉన్న దిగుమతి సుంకాలను తగ్గించాలన్న టెస్లా సీఈవో ఎలన్ మస్క్ అభ్యర్థన పట్ల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందా.. అంటే అవుననే జవాబు వస్తున్నది.
పూర్తి స్థాయిలో భారత్లో అసెంబ్లింగ్ చేసే ఎలక్ట్రిక్ కార్లకు దిగుమతి సుంకాలు తగ్గించాలన్న టెస్లా ప్రతిపాదనకు పలు కేంద్ర మంత్రిత్వశాఖలు మద్దతుగా నిలిచాయని తెలుస్తోంది. టెస్లాకు రోడ్డు రవాణా శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, నీతి ఆయోగ్ మద్దతు పలికాయి. టెస్లా ప్రతిపాదనపై ఆర్థికశాఖ తుది నిర్ణయం తీసుకోనున్నది.
టెస్లా ప్రతిపాదనకు భారీ పరిశ్రమల శాఖతోపాటు దేశంలోని పలు ఆటోమొబైల్ దిగ్గజాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్కు చార్జింగ్ స్టేషన్ల నిర్మాణంతోపాటు నిర్దిష్ఠ స్థాయిలో మౌలిక వసతులను కల్పించిన సంస్థలకు దిగుమతి సుంకాల తగ్గింపు వర్తిస్తుందని అధికారులు సంకేతాలిచ్చారు.
మరోవైపు ఆటోమొబైల్ విడి భాగాలు భారత్లో తయారైనా దిగుమతి సుంకాల నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ క్రమంలోనే భారత్లో కొన్ని విడి భాగాలను కొనుగోలు చేయాలని ఎలన్ మస్క్ యోచిస్తున్నట్లు తెలిసింది. చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం వల్ల అన్ని వాహనాలు చార్జింగ్ చేసుకునే వెసులుబాటు లభిస్తుందని పలు మంత్రిత్వశాఖలు సానుకూలంగా ఉన్నాయి.
అయితే, దేశీయంగా మాన్యుఫాక్చరింగ్ యూనిట్ను తప్పనిసరి ఏర్పాటు చేయాలని టెస్లా ఎగ్జిక్యూటివ్లకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇంతకుముందు ఆపిల్ కూడా ఇదే ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు.. భారత్లో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ ప్రతినిధులకూ ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.