Tesla EV Car | అమెరికాకు చెందిన అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత మార్కెట్లోకి ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నది. త్వరలోనే ఈ నిరీక్షణకు తెరపడే అవకాశం ఉన్నది. భారత్లో ఏడాదికి దాదాపు 5లక్షల ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే సామర్థ్యంతో కార్ల ప్లాంట్ను నెలకొల్పేందుకు కేంద్రంలో చర్చలు జరుపుతున్నది. ఈ విషయంపై ఓ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ప్లాంట్ ఏర్పాటు, కార్ల ధరలను నివేదిక వెల్లడించింది. భారత మార్కెట్లో టెస్లా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు రూ.20లక్షల నుంచి ప్రారంభమవుతాయని నివేదిక పేర్కొంది.
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కంపెనీ ఇండో పసిఫిక్ రీజియన్లోని దేశాలకు కార్లను ఎగుమతి చేయాలని భావిస్తున్నది. ఇందుకు భారత్ను ఎగుమతి కేంద్రంగా వినియోగించుకోవాలని కంపెనీ ఆలోచనలు చేస్తున్నందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే టెస్లా కంపెనీ ప్రతినిధులు సమావేశమైన విషయం తెలిసిందే. అయితే, టెస్లా భారత మార్కెట్లోకి కార్లను దిగుమతి చేయాలని భావించింది. పన్నులు తగ్గించాలని టెస్లా విజ్ఞప్తి చేయగా.. భారత ప్రభుత్వం ఇందుకు నిరాకరించింది. తప్పనిసరిగా భారత్లో కార్ల ప్లాంట్ను ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
ఆ తర్వాత కంపెనీ తన వైఖరిని మార్చుకొని భారత మార్కెట్లోకి ప్రవేశించే లక్ష్యంతో మే నెలలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపింది. అయితే, కార్ల తయారీ, బ్యాటరీల తయారీకి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలపై చర్చించినట్లు నివేదిక పేర్కొంది. గత నెలలో ఎలాన్ మస్క్, ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంలో భారత్లో గణనీయమైన పెట్టుబడులు పెట్టాలని మోదీ కోరారు.
సోలార్ పవర్, స్టేషనరీ బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ వాహనాలతో సహా పలు విషయాల్లో భారతదేశానికి బలమైన సామర్థ్యం ఉందని సమావేశం అనంతరం ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. స్పేస్ ఎక్స్ స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ను సైతం భారత్కు తీసుకురావాలని ఎలాన్ మస్క్ భావిస్తున్నారు.