న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఈ ఏడాది జనవరి-నవంబర్ మధ్య 10 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.11,617 కోట్లకుపైగా మొండి బకాయి (నిరర్థక ఆస్తులు లేదా ఎన్పీఏ)లను నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్)కు బదిలీ చేశాయని రాజ్యసభలో ఓ ప్రశ్నకుగాను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. ఈ ప్రభుత్వ బ్యాంకుల్లో ఎస్బీఐ, పీఎన్బీ, కెనరా, యూబీఐ, బీవోబీ, బీవోఐ, బీవోఎం, ఐవోబీ, సెంట్రల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్లున్నాయి. ఎన్ఏఆర్సీఎల్కు ఎస్బీఐ నుంచి అత్యధికంగా రూ.4,508 కోట్ల ఎన్పీఏలు వెళ్లాయి.
ఆ తర్వాత పీఎన్బీ (రూ.2,138 కోట్లు), కెనరా (రూ.1,858 కోట్లు), యూబీఐ (రూ.1,831 కోట్లు) బ్యాంకులున్నాయి. కాగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరు నాటికి ఈ 10 ప్రభుత్వ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు రూ.3.65 లక్షల కోట్లపైనే ఉన్నాయి. ఇదిలావుంటే నవంబర్ 30కల్లా ఎన్ఏఆర్సీఎల్ రూ.16.64 కోట్లను రికవరీ చేయగలిగిందంటూ మంత్రి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఎన్ఏఆర్సీఎల్ అనేది ఓ బ్యాడ్ బ్యాంక్. బ్యాంకులు ఇతరత్రా రుణదాతల నుంచి మొండి బకాయిలను ఇది కొంటుందన్న విషయం తెలిసిందే.
4వేల కిలోల బంగారం సీజ్
ఈ ఏడాది జనవరి-అక్టోబర్ మధ్య రికార్డు స్థాయిలో 3,917.52 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని సీజ్ చేసినట్టు రాజ్యసభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి తెలిపారు. మొత్తం 4,798 కేసులు నమోదైనట్టు చెప్పారు. గత ఏడాది 3,982 స్మగ్లింగ్ కేసుల్లో 3,502.16 కిలోల పసిడిని జప్తు చేసినట్టు వివరించారు. ఇక 2021లో 2,445 కేసుల్లో 2,383 కిలోలు, 2020లో 2,567 కేసుల్లో 2,155 కిలోల స్మగ్లింగ్ పుత్తడిని స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.