న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: దేశవ్యాప్తంగా టెలికం సబ్స్ర్కైబర్లు అంతకంతకు పెరుగుతున్నారు. డిసెంబర్ 2023 నాటికి సబ్స్ర్కైబర్ల సంఖ్య 119 కోట్లకు చేరుకున్నట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది. టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్లు నూతన సబ్స్ర్కైబర్లను ఆకట్టుకోవడంతో టెలికం సబ్స్ర్కైబర్లు పెరగడానికి ప్రధాన కారణమని తెలిపింది. అలాగే బ్రాడ్బ్యాండ్ వినియోగదారులు స్వల్పంగా పెరిగి 90.4 కోట్లకు చేరుకున్నారని తెలిపింది. మొత్తం వినియోగదారుల్లో 76 శాతం వీరే ఉన్నారని నెలవారి సమీక్షలో వెల్లడించింది. గతేడాది నవంబర్ చివరినాటికి 118.57 కోట్ల మంది టెలిఫోన్ సబ్స్ర్కైబర్లు ఉండగా, ఆ మరుసటి నెల చివరినాటికి ఈ సంఖ్య 119.03 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. కంపెనీల వారిగా చూస్తే రిలయన్స్ జియో నెట్వర్క్ను 39.94 లక్షల మంది మొబైల్ సబ్స్ర్కైబర్లు ఎంచుకోగా, భారతీ ఎయిర్టెల్ను 18.5 లక్షల మంది ఎంచుకున్నారు. కానీ, వొడాఫోన్ ఐడియా మాత్రం 13.68 లక్షల మంది మొబై ల్ కస్టమర్లను కోల్పోగా, ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా 1.5 లక్షలు, ఎంటీఎన్ఎల్ 4,420 మంది వైదొలిగారు.