Mobile Tariff Hike | లోక్సభ ఎన్నికల తర్వాత వివిధ ప్లాన్ల టారిఫ్ చార్జీలు పెంచేందుకు టెలికం సంస్థలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం పెంపునకు ప్లాన్ ధర పెంచాలని ఎయిర్టెల్ భావిస్తున్నది. డేటా వినియోగం పెంపుతో అధిక ధర గల ప్లాన్ల వైపు సబ్ స్క్రైబర్లను మళ్లించాలని రిలయన్స్ జియో యోచిస్తున్నట్లు తెలుస్తున్నది.
రిలయన్స్ జియోతో పోలిస్తే భారతీ ఎయిర్టెల్ టారిఫ్ ప్లాన్లు కాస్త ఎక్కువే. తొలి నుంచి సగటు ఆదాయం పెంచుకుంటూ వస్తున్నా, జియో ఆదాయం స్థిరంగా ఉంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ వల్ల డేటా వినియోగం పెరిగితే లాభం పొందొచ్చునని జియో ఆలోచన. యూజర్లకు ఉచితంగానే జియో సినిమా ప్రసారాలు అందిస్తున్న రిలయన్స్ జియో.. మెరుగైన అనుభూతి కోసం యూజర్లు అధిక డేటా వాడతారని భావిస్తున్నట్లు టెలికం ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఎయిర్ టెల్ యూజర్ మీద తన సగటు ఆదాయం పెంచుకోవడానికి ప్లాన్ ధరల్లో సవరణలు చేస్తుందని అంటున్నారు. జూలై- అక్టోబర్ మధ్య 15 నుంచి 20 శాతం టారిఫ్ చార్జీల పెంచుతూ ఎయిర్ టెల్ ప్రకటిస్తుందని తెలుస్తున్నది. మార్కెట్ పరంగా మొదటి స్థానంలో ఉన్న రిలయన్స్ జియో సగటు ఆదాయం రూ.182 అయితే, ఎయిర్ టెల్ రూ.208 పొందుతున్నది.