హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో అత్యుత్తమ మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. ఓఆర్ఆర్ నిర్మాణంతోపాటు, రీజినల్ రింగ్ రోడ్, మెట్రో ఫేజ్ 2, గ్రిడ్ పాలసీ తీసుకురావటం వంటి అనేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ కృషి నిరంతరం కొనసాగుతుందని, హైదరాబాద్ అన్ని వైపుల మౌలిక సదుపాయాల కల్పన కోసం పీపీఈ మోడ్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మంగళవారం ఇక్కడ ఓ హోటల్లో హైసియా రెండో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ సన్నాహక కార్యక్రమం జరిగింది. ఇందులో హైసియా ప్రెసిడెంట్ భరణి అరోల్, వెల్స్ ఫార్గో ఈవీపీ అండ్ ఎండీ బెనర్జీ, హైసియా ఇన్ఫ్రా ఫోరం లీడర్ రమేశ్తో కలిసి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. ‘ఎక్వెస్ట్ ఫర్ లెగసీ-ద నెక్స్జెన్ ఇన్ఫ్రా విత్ ఫోకస్ ఆన్ స్మార్ట్ మొబిలిటీ, ఎనర్జీ అండ్ వర్క్ప్లేస్’ పేరుతో ఈ నెల 22న ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు హైసియా ప్రకటించింది. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల పరిశ్రమలకు చెందిన 300లకుపైగా ప్రతినిధులు, ఐటీ ఇన్ఫ్రా ప్రొవైడర్స్, కన్సల్టెంట్స్, ప్రభుత్వ, ఆర్అండ్డీ నిపుణులు హాజరవుతారు.