హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, థాయ్లాండ్ మధ్య వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహంపై మంగళవారం ఒప్పందం కుదిరింది. రెండు ప్రభుత్వాలు పరస్పర వాణిజ్య సహకారం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్స్ అభివృద్ధిపై ఎంవోయూ కుదుర్చుకొన్నాయి. రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, థాయ్లాండ్ వాణిజ్యశాఖ శాశ్వత కార్యదర్శి బూన్యరిత్ కలయానమిత్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇరుపక్షాలు వ్యవసాయ ఆధారిత ఆహార శుద్ధి పరిశ్రమలు, కలప ఆధారిత పరిశ్రమలు, ఉడ్ ప్రాసెసింగ్లో పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించాయి. ఒక దేశ వాణిజ్యశాఖ భారత్లోని రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం చరిత్రలో ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు. ఒప్పందానికి ముందు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, థాయ్లాండ్ ఉప ప్రధాని, వాణిజ్యశాఖ మంత్రి జూరిన్ లక్సనావిస్ట్ వర్చువల్ పద్ధతిలో సమావేశమయ్యారు.