2019 సాధారణ ఎన్నికలకు ముందు వివిధ రాష్ర్టాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసిన మోదీ
దేశవ్యాప్తంగా ఆయా రాష్ర్టాల్లో మొదలైన మొత్తం 1,500 ప్రాజెక్టులు
2020 కంటే ముందు ప్రారంభించిన ప్రాజెక్టుల్లో సగం కూడా పూర్తికాని 494 భారీ ప్రాజెక్టుల పనులు
ఈ ఏడాది మార్చినాటికి ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని నీతి ఆయోగ్పై కేంద్రం ఒత్తిడి
కేంద్ర ప్రభుత్వం తీరును తప్పుబడుతున్న నిపుణులు
గడిచిన ఎనిమిదిన్నరేండ్లుగా ప్రాజెక్టులను పూర్తి చేయకుండా తాత్సారం చేయడంపై సర్వత్రా విమర్శలు
అభివృద్ధి ఆగింది.. ప్రాజెక్టుల ప్రగతిని సందిగ్ధంలో పడేస్తూ చేతగాక చేతులెత్తేస్తున్నది మోదీ సర్కారు.
కాదంటే నీతి ఆయోగ్.. లేదంటే రాష్ర్టాలను దోషులుగా నిలబెట్టే కుట్ర చేస్తున్నది. రైల్వేలు, రోడ్లు-హైవేలు, బొగ్గు, విద్యుత్తు ఇలా చెప్తూపోతే కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపాలకు, నిర్లక్ష్య ధోరణికి బలైపోతున్న కీలక రంగాలెన్నో కనిపిస్తున్నాయి.
నిజానికి కరోనా బారినపడి బక్కచిక్కిన దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిలూదేవే ఈ ప్రాజెక్టులు. అయినప్పటికీ వాటిని పూర్తి చేయడంలో కేంద్రం మాత్రం అలసత్వాన్నే ప్రదర్శిస్తున్నది. సరైన నిధులను కేటాయించకపోవడంతో రూ.1.26 లక్షల కోట్ల విలువైన పనులకు ఆటంకం ఏర్పడింది. చివరకు ముందుగా అనుకున్న బడ్జెట్ను పెంచినా గడువులోగా అందని దుస్థితి నెలకొన్నదిప్పుడు. దీంతో తమ తప్పేమీ లేదంటూ నీతి ఆయోగ్ లెక్కలపై, రాష్ర్టాల సహకారంపై కేంద్ర పాలకులు నిందలు మోపుతున్నారు. మరోవైపు రాబోయే బడ్జెట్లో విస్మరిస్తే 76 ప్రాజెక్టుల కథ కంచికి చేరినట్టేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): పని జరిగితే ఆ ఖ్యాతి తమ ఖాతాలో పడిపోవాలి.. ఆ పని జరిగే అవకాశం లేకుం టే ఇతరులపై నెపం నెట్టాలి.. బాధ్యతను వదిలించుకుని బలిపశువులను చేయాలి.. పెండిం గ్ ప్రాజెక్టుల విషయంలో మోదీ సర్కారు చేస్తున్నది సరిగ్గా ఇదే. వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను సమయానికి పూర్తి చేయకుండా గాలికొదిలేసిన కేంద్రం.. వచ్చే సాధారణ ఎన్నికలనాటికి అవి పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో కొత్త ఎత్తు వేసింది. ప్రణాళికలు రూపొందించే నీతి ఆయోగ్పై, సహకరించడం లేదంటూ రాష్ర్టాలపై నిందలు మోపేందుకు సిద్ధమవుతున్నది మరి. నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆకలి కేకలు, ఆర్థిక సంక్షోభం.. వెరసి కేంద్ర ప్రభుత్వంపై ఇప్పటికే దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
సగం ప్రాజెక్టులు పూర్తవ్వలేదు
గడిచిన దాదాపు తొమ్మిదేండ్లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుల పనులు ఇంకా సగం కూడా పూర్తికాలేదు. మరోవైపు శంకుస్థాపన చేసిన భారీ ప్రాజెక్టులను డెడ్లైన్ కంటే ముందు పూర్తి చేయకపోతే, వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల్లో దెబ్బ తినడం ఖాయమని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. దీంతో నరేంద్ర మోదీ- అమిత్ షా ద్వయం కొత్త కుట్రకు తెరతీసింది. రూ.10 వేల కోట్ల పైచిలుకు ప్రాజెక్టుల పర్యవేక్షణ బాధ్యతను ‘నీతి ఆయోగ్’కు అప్పగించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చి నాటికి ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేలా శ్రమించాలనీ ఒత్తిడి తీసుకొస్తున్నది. సంబంధిత రాష్ట్ర, కేంద్ర మంత్రిత్వ శాఖలు, అధికారులతో సమన్వయం చేసుకొని ఈ ప్రాజెక్టులను ఎలాగైనా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించింది. ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని హమీ కూడా ఇచ్చింది. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు దక్కేలా లేకపోవడంతో కేంద్రం ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నది.
ఈసారికిదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్
కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ సర్కారుకు రాబోయే బడ్జెటే చివరి పూర్తిస్థాయి పద్దు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలున్నందున అప్పుడు ప్రకటించే బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే అవుతుంది. దీంతో ఆగిపోయిన ప్రాజెక్టులకు మరిన్ని నిధులను అందించే అవకాశం ఈసారే ఉంటుందని ఆయా రంగాల విశ్లేషకులు చెప్తున్నారు. నిజానికి గడిచిన ఎనిమిదిన్నరేండ్లలో అరకొర నిధులతో సరిపెట్టిన కేంద్రం.. నీతి ఆయోగ్ లక్ష్యాలను చేరుకోలేకపోయింది. దీంతో ఈసారైన సరిపడా కేటాయింపులు జరుపాలంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను మోదీ సర్కారు రూ.39,44,909 కోట్ల బడ్జెట్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రాజెక్టుల కోసం కనీసం 15 శాతం కూడా లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో వచ్చే నెల 1న పార్లమెంట్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ప్రాజెక్టులకు పెద్దపీట వేయకపోతే కష్టమేనన్న అభిప్రాయాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
ఏయే రాష్ర్టాల్లో ఎన్నెన్ని కదలని ప్రాజెక్టులు
తమిళనాడు : 14
బీహార్ : 13
మహారాష్ట్ర, బెంగాల్ : 7
తెలంగాణ, రాజస్థాన్ : 6
ఉత్తరప్రదేశ్ : 5
ఆంధ్రప్రదేశ్ : 4
ఉత్తరాఖండ్, కేరళ, అస్సోం, కర్ణాటక : 3
మిగతా రాష్ర్టాలు : 24
ఆగే ప్రాజెక్టుల్లో 70% విపక్ష రాష్ర్టాలవే..
కేంద్రంలోని బీజేపీ సర్కారు ఏకంగా 116 ప్రాజెక్టులకు రాష్ర్టాలపై నెపం పెట్టి.. మంగళం పాడాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ఆగిపోతున్న ఈ ప్రాజెక్టుల విలువ రూ.1.26 లక్షల కోట్లపైనే. అయితే 70 శాతానికిపైగా ప్రాజెక్టులు విపక్ష ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లోనే ఉండటం గమనార్హం. కాగా, గతంలో మంజూరైన ప్రాజెక్టులతోపాటు, సగం పనులు పూర్తయిన వాటిని కూడా అటకెక్కించాలని కేంద్రం తాజాగా నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఇక ఈ ప్రాజెక్టుల కోసం ఇప్పటిదాకా రూ.20,312 కోట్ల నిధులను ఖర్చు చేశారు. మొత్తానికి ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేయడం చేతగాక, చేతులెత్తేసిన కేంద్రం.. ఆ నెపాన్ని రాష్ర్టాలపై నెట్టేసే కుట్రకు తెరతీసింది. భూసేకరణలో సమస్యలు, కేంద్రం-రాష్ర్టాల మధ్య వివాదాలు, నిధుల కేటాయింపుల్లో ఏకాభిప్రాయం రాకపోవడం వంటి కారణాలతోనే ఈ ప్రాజెక్టులను నిలిపివేస్తున్నట్టు నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు.