హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ పోలీసులు ఆధునిక సాంకేతికతను అస్త్రంగా మలుచుకొంటున్నారు. సాంకేతిక వ్యవస్థలో సంచలనాలు సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో సైబర్ నేరాలను నివారించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఐఐటీ కాన్పూర్తో టై అప్ అయ్యారు. ఐఐటీ కాన్పూర్కు చెందిన ‘సీ3ఐహబ్’ రూపొందించిన ఏఐ ఆధారిత సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టూల్ను ఉపయోగించనున్నారు. ‘సీ3ఐహబ్’ రూపొందించి, ఇంకా పేరు పెట్టని ఈ సరికొత్త సైబర్ క్రైమ్ టూల్ సైబర్ ప్రపంచానికి సంబంధించిన నేరాల దర్యాప్తులో పోలీసులకు విరివిగా సాయం చేస్తుంది.
దీని ఏఐ నేరాల నివారణకు మార్గనిర్దేశనం చేస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఇది ‘వర్చువల్ ఇన్వెస్టిగేషన్ పాత్ర’ను పోషిస్తుంది. పోలీసులు అందించిన సమాచారం ఆధారంగా వారికి అవసరమైన సమాచారాన్ని నిర్దేశిస్తుంది. అదే తరహా నేరాలకు పాల్పడుతున్న సైబర్ దొంగలను కనుగొనడంలో కీలకంగా పనిచేస్తుంది. ఈ ఫీచర్లతో సైబర్ నేరస్తులపై పటిష్టమైన కేసులు రూపొందించి, వారిని చట్టపరంగా శిక్షించేందుకు అవసరమైన సాయం చేస్తుంది.