న్యూఢిల్లీ : టెక్ కంపెనీలు గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటున్నాయి. రాబడులు తగ్గడంతో టెక్ కంపెనీలు హైరింగ్ నిలిపివేత, వ్యయాలకు కోత విధించడం వంటి చర్యలు చేపడుతున్నాయి. పలు కంపెనీలు ఏకంగా ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నాయి. తాజాగా టెక్ స్టార్టప్ బైజూస్ 2500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.
రానున్న ఆరు నెలల్లో ప్రోడక్ట్, కంటెంట్, మీడియా, టెక్నాలజీ వంటి విభాగాల్లో 5 శాతం ఉద్యోగాలపై వేటు వేయనున్నట్టు వెల్లడించింది. బైజూస్లో మొత్తం 50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. బడ్జెట్ వ్యయాల నియంత్రణ, మార్కెటింగ్, నిర్వహణ వ్యయాల తగ్గింపులో భాగంగా బైజూస్ మాస్ లేఆఫ్కు మొగ్గుచూపింది.
ఇక తన కే10 సబ్సిడరీలు మెరిట్నేషన్, ట్యూటర్విస్టా, స్కాలర్, హ్యాష్లెర్న్ను ఒక బిజినెస్ యూనిట్ కిందకు బైజూస్ తీసుకువస్తోంది. అయితే ఆకాష్, గ్రేట్ లెర్నింగ్లు స్వతంత్ర బిజినెస్లుగా కొనసాగుతాయి. మరోవైపు 2021 ఆర్ధిక సంవత్సరంలో బైజూస్ రూ 4548 కోట్ల నష్టం నమోదు చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ నష్టం 19 రెట్లు అధికం కావడం గమనార్హం. ఇక ట్యూషన్ సెంటర్, లెర్నింగ్ యాప్లకు ఆదరణ పెరిగిందని బైజూస్ కో ఫౌండర్ దివ్య గోకుల్నాధ్ వెల్లడించారు.