ముంబై, అక్టోబర్ 25: ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,338.70 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,064.60 కోట్ల లాభంతో పోలిస్తే 26 శాతం అధికమని పేర్కొంది. మహీంద్రా గ్రూపునకు చెందిన ఈ సంస్థ గత త్రైమాసికానికిగాను రూ.10,881.30 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కంపెనీ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించడం ఇదే తొలిసారి కావడం విశేషం. క్యూ1లో నమోదైన లాభంతో పోలిస్తే 6.4 శాతం అధికం.
వలసలతో సతమతం
ఉద్యోగుల వలసలతో టెక్ మహీంద్రా సతమతమవుతున్నది. గత త్రైమాసికంలో
వలసలు 21 శాతంగా ఉన్నాయి. ఏడాది క్రితం 14 శాతంగా ఉండగా, అదే జూన్
త్రైమాసికంలో 17 శాతంగా ఉన్నది. గత త్రైమాసికంలో కొత్తగా 14 వేల మంది సిబ్బందిని నియమించుకున్నది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1.41 లక్షలకు చేరుకున్నారు.
“నైపుణ్యం కలిగిన సిబ్బందికి మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉండటంతో ఉద్యోగుల వలసలు పెరిగాయి. అయినప్పటికీ అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరిచాం. బెంగళూరు,హైదరాబాద్, పుణె నగరా ల్లో వలసలు అత్యధికంగా ఉన్నాయి. కానీ భువనేశ్వర్, నాగపూర్లలో మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి”