న్యూఢిల్లీ : కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించాలని టెక్ దిగ్గజాలు సన్నద్ధమవుతుండగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో పునరాలోచనలో పడ్డాయి. ఉద్యోగులను తిరిగి కార్యాలయాల నుంచి పనిచేయాలని కోరేందుకు టీసీఎస్, హెచ్సీఎల్, ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీలు తర్జనభర్జనలు సాగిస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం మోడల్కు స్వస్తిపలికే విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నాయి. తొలుత జనవరి 22 నుంచి బ్యాక్ టూ ఆఫీస్ ప్రణాళికలను అమలు చేయాలని నిర్ణయించినట్టు ఆయా కంపెనీలు ప్రకటించగా ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి.
దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ ఎగుమతిదారు టీసీఎస్లో ప్రస్తుతం పది శాతం మంది అసోసియేట్లు కార్యాలయాల నుంచి పనిచేస్తుండగా పూర్తిస్ధాయిలో సిబ్బందిని కార్యాలయాలకు రప్పించడంపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. మారుతున్న ఆరోగ్య పరిస్ధితులకు అనుగుణంగా అప్రమత్తతో వ్యవహరిస్తామని ఇన్ఫోసిస్ పేర్కొంది. తాజా కొవిడ్ వేరియంట్లు ఉద్యోగుల కదలికలను ఎంతమేర ప్రభావితం చేస్తాయనేది నిరంతరం మదింపు చేస్తున్నామని హెచ్సీఎల్ టెక్నాలజీస్ వెల్లడించింది. ప్రస్తుతం పదో వంతు ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేస్తున్నారని ప్రస్తుత హైబ్రిడ్ మోడల్ కొనసాగుతుందని తాము భావిస్తున్నామని కంపెనీ పేర్కొంది.
కాగా ఈ ఏడాది డిసెంబర్ లేదా 2022 జనవరి నుంచి ఉద్యోగులను దశలవారీగా కార్యాలయాల నుంచి పనిచేసేందుకు ఏర్పాట్లు చేస్తామని అక్టోబర్లో పలు ఐటీ కంపెనీలు ప్రకటించాయి. నూతన సంవత్సరం నుంచి టెకీల్లో సగం మంది వారానికి మూడు రోజులు కార్యాలయాలకు హాజరవుతారని పరిశ్రమ సంస్ధ నాస్కామ్ కూడా అంచనా వేసింది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో క్షేత్రస్ధాయి పరిస్ధితులు మారడం ఐటీ కంపెనీల బ్యాక్ టూ ఆఫీస్ ప్రణాళికలపై ప్రభావం చూపిందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.