న్యూఢిల్లీ, నవంబర్ 15: టాటా కన్సల్టన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ‘అనైతిక బదిలీ ప్రక్రియలు’ అనుసరిస్తుందంటూ ఐటీ వర్కర్స్ యూనియన్ నైట్స్ (నాస్కెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్) కేంద్ర కార్మిక, ఉపాధికల్పనా శాఖకు ఫిర్యాదు చేసింది. తగిన నోటీసు, సంప్రదింపులు లేకుండా వివిధ నగరాలకు 2000 మంది ఉద్యోగుల్ని టీసీఎస్ బలవంతపు బదిలీలు చేసి, వారికి, వారి కుటుంబాలకు తీవ్ర వేదనకు గురిచేసిందని నైట్స్ పేర్కొంది.
తమకు ఈ అంశమై 180కిపైగా ఫిర్యాదులు అందాయన్నది. బదిలీ ఆదేశాల్ని పాటించకపోతే క్రమశిక్షణా చర్యల్ని తీసుకోవాల్సి వస్తుదంటూ టీసీఎస్ ఉద్యోగుల్ని హెచ్చరించినట్టు యూనియన్ అధ్యక్షుడు హరప్రీత్ సింగ్ సలూజా చెప్పారు. ఇటువంటి అనైతిక ప్రక్రియల నుంచి ఐటీ ఉద్యోగుల్ని సంరక్షించేందుకు ఈ అంశంపై దర్యాప్తు జరిపి తగిన చర్యల్ని తీసుకోవాలంటూ తాము కేంద్ర కార్మిక శాఖను కోరామన్నారు.