న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: పనిచేయడానికి, వృత్తిలో ఎదిగేందుకు దేశంలో అత్యుత్తమ వర్క్ప్లేస్గా ఐటీ దిగ్గజం టీసీఎస్ నిలిచింది. ‘2023 టాప్ కంపెనీస్ ఇన్ ఇండియా’ పేరుతో లింక్డ్ఇన్ విడుదల చేసిన జాబితాలో టీసీఎస్ తర్వాతి స్థానాల్లో అమెజాన్, మోర్గాన్ స్టాన్లీలు ఉన్నాయి. గత ఏడాది జాబితాలో టెక్నాలజీ కంపెనీలు ఆధిపత్యంలో ఉండగా, తాజా లిస్ట్లో ఫైనాన్షియల్ సర్వీసులు/బ్యాంకింగ్/ఫిన్టెక్లు ఎక్కువగా ఉన్నాయి. టాప్-25లో ఫైనాన్షియల్ సర్వీసుల కంపెనీ మెక్వైరీ గ్రూప్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మాస్టర్కార్డ్, ఫిన్టెక్ సంస్థ యుబీ తదితర 10 కంపెనీలు ఈ విభాగాలకు చెందినవే ఆక్రమించాయి. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో కెరీర్లో వృద్ధికి అవకాశం కల్పించే కంపెనీల కోసం వృత్తినిపుణులు చూస్తున్నారని, తగిన ఉద్యోగ అవకాశాల అన్వేషణకు ఈ జాబితా ఉపకరిస్తుందని లింక్డ్ఇన్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్ నిరాజిత బెనర్జీ తెలిపారు.
గేమింగ్ కార్యకలాపాలు ఊపందుకోవడాన్ని ప్రతిబింబిస్తూ తొలిసారిగా ఈ-స్పోర్ట్స్, గేమింగ్ కంపెనీలైన డ్రీమ్11, గేమ్స్ 24×7లు తొలిసారిగా టాప్- 25 జాబితాలో ప్రవేశించాయి. 25 కంపెనీల్లో 17 సంస్థలు ఈ సంవత్సరపు జాబితాలో తొలిసారి చోటుచేసుకున్నాయని లింక్డ్ఇన్ తెలిపింది.
జాబితాలోని టాప్ టెక్నాలజీ కంపెనీల్లో ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ (ఏఐ), రొబాటిక్స్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, కంప్యూటర్ సెక్యూరిటీ నైపుణ్యాలకు డిమాండ్ ఉంది. ఫైనాన్షియల్ రంగ కంపెనీలు కమర్షియల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్రోత్ స్ట్రాటజీస్ నిపుణుల్ని కోరుకుంటున్నాయి. ఇండస్ట్రియల్ డిజైన్, గేమ్ డెవలప్మెంట్ వంటి నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతున్నదని లింక్డ్ఇన్ వివరించింది.