న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో వర్క్ ఫ్రం హోం పద్ధతి (TCS) విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ఐటీ వర్క్ కల్చర్ రిమోట్ సిస్టమ్లోకి మారింది. ఇంటి నుంచి పనిచేసేందుకు పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు అనుమతించడంతో ఉద్యోగులు స్వేచ్ఛగా పనిచేసుకున్నారు. అయితే కొవిడ్-19 ప్రభావం తగ్గుముఖం పట్టడంతో కంపెనీలన్నీ తిరిగి ఉద్యోగులను కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాలనే హైబ్రిడ్ మోడ్ తెరపైకి వచ్చింది.
ఇక ఐటీ దిగ్గజం టీసీఎస్ సైతం ఉద్యోగులను ఆఫీసులకు రావాలని కోరడంతో పాటు సరైన డ్రస్ కోడ్ పాటించాలని ఉద్యోగులను కోరింది. అక్టోబర్ 1 నుంచి టీసీఎస్ ఉద్యోగులు ఆఫీసుల నుంచి పనిచేయడం ప్రారంభించారు. పని వేళల్లో డ్రస్ కోడ్ పాటించాలని ఉద్యోగులకు సూచించింది. ఇంటి నుంచి పనిచేసే సమయంలో షార్ట్స్, టీషర్ట్స్ ధరించేవారని, కానీ ఆ రోజులు ముగిశాయని ముఖ్యంగా ఫ్రెషర్స్కు టీసీఎస్ గుర్తుచేసింది.
వర్కింగ్ డేస్లో మీరంతా కార్యాలయాలకు తిరిగి వచ్చి విధులు నిర్వహించాలని కంపెనీ చీఫ్ హెచ్ఆర్ అధికారి మిలింద్ లక్కాడ్ ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్లో పేర్కొన్నారు. గత రెండేండ్లుగా తమ అసోసియేట్స్లో అత్యధికులు వర్చువల్, హైబ్రిడ్ పద్ధతుల్లో పనిచేశారని, టీసీఎస్ విలువలు, టీసీఎస్ ఒరవడిలో ముందుకెళ్లేందుకు ఆఫీస్ నుంచి పనిచేయడం కీలకమని అన్నారు. ఆఫీస్ల నుంచి పనిచేయడంతో పాటు ఉద్యోగులు సరైన తీరులో డ్రెస్ కోడ్ను పాటించడం ద్వారా ప్రొఫెషనలిజం విలువలను ప్రదర్శించాలని ఉద్యోగులకు పంపిన మెయిల్లో కోరారు.
Read More :