TCS | ముంబై, మార్చి 29: కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రాధాన్యత అన్ని రంగాల్లోనూ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఐటీ సంస్థలూ ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ ఐటీ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. జనరేటివ్ ఏఐ స్కిల్స్లో 3.5 లక్షల మందికిపైగా ఉద్యోగులకు శిక్షణ ఇచ్చినట్టు శుక్రవారం తెలిపింది. ఈ ఏడాది జనవరిలో 1.5 లక్షల ఉద్యోగులకు శిక్షణ ఇచ్చినట్టు ప్రకటించిన టీసీఎస్.. తాజాగా ఆ సంఖ్య 3.5 లక్షలను దాటేసిందని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఏఐ పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులను కలిగిన సంస్థల్లో ఒకటిగా టీసీఎస్ ఎదుగుతోందని ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో టీసీఎస్ పేర్కొన్నది. నిజానికి గత ఏడాదే ఏఐ కోసం ఓ బిజినెస్ యూనిట్ను ఏర్పాటు చేసి, ఆ ఘనతను సాధించిన తొలి టెక్నాలజీ కంపెనీగా టీసీఎస్ నిలిచింది.
టీసీఎస్ ఫ్రెషర్ల నియామకాలను మొదలు పెట్టింది. మూడు విభాగాల్లో కొత్తవారిని ఉద్యోగాల్లోకి సంస్థ తీసుకుంటున్నది. నింజా, డిజిటల్, ప్రైమ్ కేటగిరీల్లో హైరింగ్కు టీసీఎస్ దిగుతున్నది. నిజానికి కరోనా, మార్కెట్లో డిమాండ్ లేని కారణంగా ఐటీ సంస్థలు నియామకాల ప్రక్రియను దాదాపుగా పక్కకు పెట్టేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో టీసీఎస్.. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు కొత్త ఉత్సహాన్నిచ్చేలా చేస్తుండటం విశేషం. కాగా, ఏప్రిల్ 10 దరఖాస్తులకు ఆఖరు తేదీ. ఏప్రిల్ 26న పరీక్షలుంటాయి. ఈ ఏడాది బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఎస్ బ్యాచ్ విద్యార్థుల నుంచి కంపెనీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇదిలావుంటే నింజా కేటగిరీలో వివిధ హోదాలకుగాను వార్షిక వేతన ప్యాకేజీ రూ.3.36 లక్షలు. అయితే డిజిటల్, ప్రైమ్ కేటగిరీల్లో జీతాలు రూ.7 లక్షలు, రూ.9-11.5 లక్షలుగా ఉండటం గమనార్హం. అయితే ఈ దఫా ఎన్ని ఖాళీలను టీసీఎస్ భర్తీ చేస్తుందన్నది మాత్రం తెలియరాలేదు.