TCS Financial Results | దేశీయ ఐటీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో రూ.11,058 కోట్ల నికర లాభం గడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో రూ.10,846 కోట్ల నికర లాభంతో పోలిస్తే రెండు శాతం ఎక్కువ. కంపెనీ కన్సాలిడేటెడ్ రెవెన్యూ నాలుగు శాతం పెరిగి రూ.58,229 కోట్ల నుంచి రూ.60,583 కోట్లకు పెంచుకున్నది. టీసీఎస్ నికర మార్జిన్ 19.4 శాతం వద్ద నిలవగా, ఆపరేటింగ్ మార్జిన్లు 24.3 శాతం నుంచి 25 శాతానికి పెరిగాయి. కంపెనీ నికర ఆదాయం 8.2 శాతం పెరిగి రూ.11,735 కోట్లకు చేరుకున్నది. 2022-23తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ నుంచి అట్రిక్షన్లు 13.3 శాతంగా నిలిచాయి.
ఈ నేపథ్యంలో టీసీఎస్ తన వాటాదారులకు షేర్పై తాత్కాలిక డివిడెండ్ రూ.9, స్పెషల్ డివిడెండ్ రూ.18 కలిపి మొత్తం రూ.27 డివిడెంట్ ప్రకటించింది. దీర్ఘకాలిక గ్రోత్ను ద్రుష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నట్లు టీసీఎస్ ఎండీ కం సీఈఓ కే కీర్తివాసన్ తెలిపారు. జనరేటివ్ ఏఐ పట్ల చాలా మందిలో ఆసక్తి ఉందన్నారు. తమ కస్టమర్లకు ఈ రంగంలో సేవలందించడానికి చర్యలు చేపడతామన్నారు. కళాశాల క్యాంపస్లతోపాటు ప్రతిభా ఆధారిత నియామకాలు కొనసాగుతాయని కంపెనీ చీఫ్ హ్యుమన్ రీసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు.