ముంబై : దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ సీఈఓ, ఎండీ రాజేష్ గోపీనాధన్ 2022 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా రూ 25.76 కోట్ల వేతనం పొందారు. అంతకుముందు ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఇది 27 శాతం అధికం. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం గోపీనాధన్ రూ 1.51 కోట్ల వేతనం అందుకోగా బెనిఫిట్స్, అలవెన్సుల కింద రూ 2.25 కోట్లు పొందగా, రూ 22 కోట్లు కమిషన్ లభించింది.
ఇక టీసీఎస్ సీఓఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్ గణపతి సుబ్రమణియం రూ 1.44 కోట్ల వేతనం అందుకోగా, బెనిఫిట్లు, అలవెన్సుల కింద రూ 2.24 కోట్లు పొందారు. రూ 17 కోట్లు కమిషన్ కింద ఆయనకు లభించింది. సుబ్రమణియం గత ఆర్ధిక సంవత్సరంలో మొత్తం రూ 20.7 కోట్ల వేతన ప్యాకేజ్ను పొందగా అంతకుముందు ఏడాది కంటే ఇది ఏకంగా 29 శాతం అధికం.
ఐదేండ్ల పాటు పదవిలో ఉండేందుకు 2017లో గోపీనాధన్ నియామకం జరగ్గా 2027 ఫిబ్రవరి వరకూ ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. ఇక భారత్లో ఉద్యోగుల వార్షిక వేతన సగటు పెరుగుదల 5-8 శాతంగా ఉంది.కరోనా మహమ్మారి బలహీనపడి వ్యాపార కార్యకలాపాలు ఊపందుకోవడంతో టెక్ దిగ్గజాలు ఉద్యోగులను నిలుపుకునేందుకు వేతనాలపై భారీగా వెచ్చిస్తున్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.