న్యూఢిల్లీ : ఆర్ధిక వ్యవస్థ మహమ్మారికి ముందున్న స్థితికి చేరుతుండటంతో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో పన్ను రాబడి బడ్జెట్ అంచనాల కంటే పది శాతం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి నాలుగేండ్లలో ఇదే తొలిసారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మార్చి 31 నాటికి రూ 15.45 లక్షల కోట్ల పన్ను రాబడిని బడ్జెట్లో అంచనా వేయగా 2017-18 నుంచి ఎన్నడూ పన్ను వసూళ్లు బడ్జెట్ అంచనా దరిదాపుల్లోకి రాలేదు.
కరోనా వైరస్ వ్యాప్తికి ముందు కూడా ఆర్ధిక వ్యవస్ధ మందగమనంతో పన్ను వసూళ్లు బడ్జెట్ అంచనాలను చేరుకోలేదు. ఇక ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ సమసిన అనంతరం రిటైల్ సేల్స్ ఊపందుకోవడం, ఎగుమతులు రికార్డుస్ధాయిలో పెరగడంతో పన్ను వసూళ్లు భారీగా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో దేశ ఆర్ధిక వ్యవస్ధ ఏకంగా 20.1 శాతం వృద్ధి చెందడం పన్ను వసూళ్ల అంచనాపై ఆశలు పెంచుతోంది. అన్ని రంగాల్లో వేగంగా రికవరీ చోటుచేసుకుంటోందని, సానుకూల సంకేతాలతో ఈ ఏడాది పన్ను వసూళ్ల అంచనాను అధిగమిస్తామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.