సామాన్యులకు నిత్యావసర వస్తువుల ధరల శరాఘాతం. మధ్యతరగతి ప్రజలపై ఆదాయ పన్ను, వ్యాపారులపై కార్పొరేట్ పన్ను, జీఎస్టీల భారం. ఇదీ.. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం.ఆపదలో ఆదుకోవాల్సిన కేంద్రం.. జనం నడ్డివిరుస్తూ పన్నుల పేరుతో ఖజానాను నింపుకొనే పనిలో పడిందిప్పుడు. ఆర్థిక లక్ష్యాలేగానీ.. ప్రజా సంక్షేమం పట్టడం లేదు మరి.అంచనాలకు మించి పన్నుల రూపంలో ఆదాయం వస్తున్నా సగటు ప్రజానీకం రక్తం పీల్చడానికే బీజేపీ సర్కారు అలవాటు పడిందా?.. అంటే అవుననే చెప్పాల్సి వస్తున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రోజువారీ కనీస ఖర్చులకూ మన కుటుంబం ఇబ్బంది పడుతున్నప్పుడు మనకు అదనపు ఆదాయం అందితే ఏం చేస్తాం. ఎవరైనాసరే ఆ సొమ్మును ఆ అవసరాల కోసం వెచ్చిస్తాం. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ పని చేయడం లేదు. పన్నుల పేరుతో జనాల జేబులను లూటీ చేస్తున్న కేంద్రం.. కష్టాల్లో మాత్రం ఆపన్నహస్తం అందించకుండా జారుకుంటున్నది మరి. చివరకు కరోనాతో యావత్తు దేశం అతలాకుతలం అవుతుంటే.. దాన్ని కూడా బూచీ అని చూపి సామాన్యులను కొల్లగొట్టిన మోదీ సర్కారు.. తాజాగా ఉక్రెయిన్ పేరు చెప్పి కూడా దోచుకునే ప్రయత్నం చేస్తున్నది. దీంతో ప్రజల ఈతి బాధలను పట్టించుకోకుండా ఖజానా నింపుకోవడమే ఏకైక లక్ష్యంగా బీజేపీ పాలకులు నిర్దాక్షిణ్య పాలనను కొనసాగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా సంక్షోభంలోనూ గత ఆర్థిక సంవత్సరం పన్నుల వసూళ్ల ఆదాయం రూ.5 లక్షల కోట్లు పెరిగినా.. సంతృప్తి చెందక మరింతగా పన్నులను బాదుతున్నారు కేంద్ర పాలకులు. వాస్తవానికి నిత్యావసర వస్తువుల ధరలు, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల పెను భారాన్ని తగ్గించే దిశగా కేంద్రం ఆలోచిస్తున్న దాఖలాలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. జనాన్ని దోచింది దాచుకోవడమేనా?.. సామాన్యులను ఆదుకునే చర్యలేవీ లేవా?.. అంటున్నా కేంద్రం స్పందించకపోవడం ప్రజా సమస్యలపై మోదీ సర్కారుకున్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నది.
వివరాల్లోకి వెళ్తే..
2020-21 ఆర్థిక సంవత్సరం కంటే 2021-22లో కేంద్రానికి పన్నుల రూపంలో పెరిగిన ఆదాయం అక్షరాల రూ.5 లక్షల కోట్లు. ఇది కేంద్రం అంచనాలకు మించిన ఆదాయం. ఇలా అంచనాలకు మించి అదనంగా రాబడి వస్తే ఏ ప్రభుత్వమైనా.. ప్రజలపై పడిన భారాన్ని ఎంతోకొంత తీర్చడానికే ప్రయత్నిస్తుంది. కానీ ఆ దిశగా మోదీ సర్కారు నుంచి ఎలాంటి చర్యలు లేవు. దీంతో పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఊరట కలిగించే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా బలపడుతోంది. ముఖ్యంగా ప్రస్తుత కరోనా సంక్షోభ పరిస్థితుల్లో పెద్దన్నలా వ్యవహరించాల్సిన కేంద్రం.. బాధ్యతారాహిత్యంగా ఎలా ప్రవర్తిస్తున్నదన్న అభిప్రాయాలూ ఆయా రంగాల నిపుణుల నుంచి వినిపిస్తుండటం గమనార్హం.
రూ.27.07 లక్షల కోట్లు
2021-22లో రూ.22.17 లక్షల కోట్ల ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ఆదాయం వస్తుందని కేంద్రం అంచనా వేసిం ది. కానీ రూ.27.07 లక్షల కోట్లు వచ్చాయి. ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, జీఎస్టీ ఆదాయంలో వృద్ధి కనిపించడమే రూ.5 లక్షల కోట్ల అదనపు రాబడికి కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఎడాపెడా బాదుడు
దేశంలో అన్నిరకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు అన్నింటిపైనా ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా రవాణా చార్జీలూ పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తున్నది. వంటనూనెల ధర డబుల్ సెంచరీ కొట్టినది తెలిసిందే. నిజానికి దేశీయంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదలకు అంతర్జాతీయ మారెట్లో ముడిచమురు ధరలను బూచీగా చూపుతున్నది కేంద్రం. సర్కారుకు ఎక్సైజ్ సుంకం, సెస్సుల రూపేణా ఇబ్బడిముబ్బడిగా అదనపు రాబడి పెరిగింది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కొంత ఆదాయం వచ్చినా మొత్తంగా చూస్తే పన్ను వసూళ్లలో కేంద్రానికి ఉండే వెసులుబాటు రాష్ట్రాలకుండదు. కేంద్రం పన్నులను తగ్గిస్తే.. రాష్ర్టాల పన్నులూ ఎంతోకొంత తగ్గుతాయన్న సత్యం మరువలేం.
చివరగా..: నిజానికి ఏ రాష్ర్టానికీ 2021-22లో అంచనాలకు మించి అదనంగా పన్ను వసూళ్లు అయిన దాఖలాలు లేవు. కానీ ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపేణా అంచనాలకు మించి ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి రూ.5 లక్షల కోట్ల అదనపు ఆదాయం దక్కింది. ఇందులో ఎంతో కొంత మొత్తాన్ని సర్దుబాటు చేయడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరల నుంచి సగటు జనానికి కాస్త వెసులుబాటు కల్పించవచ్చని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ర్టాల బాగు పట్టదా..
కేంద్రం ఒంటెత్తు పోకడ.. రాష్ర్టాల అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నది. నిజానికి మోదీ సర్కారు వైఖరిని ఎప్పట్నుంచో ఎండగడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ర్టాల రెవిన్యూ పెరిగేలా కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన మద్దతు అవసరమని నొక్కి చెప్తూనే ఉన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చని కేంద్ర ఆదాయం ఎంతున్నా వృథా అని అంటూనే ఉన్నారు. ఇప్పుడు ఈ మాటలను నిజం చేస్తూ దేశ ప్రజలపట్ల, రాష్ర్టాలపట్ల కేంద్ర సంకుచిత విధానం బట్టబయలైంది. ద్రవ్యోల్బణం 7 శాతాన్ని దాటేసింది. గ్రామీణ ఆహార ధరల సూచీ 3.94 శాతం నుంచి 8.04 శాతానికి ఎగబాకింది. కేవలం ఈ నెలలోనే లీటర్ పెట్రోల్, డీజిల్ ధర సుమారు రూ.10 చొప్పున పెరిగితే, వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.50 ఎగిసింది. ఈ సెగ అందరికీ తగులుతున్నదిప్పుడు. పరిస్థితులు ఇలాగే ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ సంక్షోభంలోకి జారుకోవడం ఖాయమే.