న్యూఢిల్లీ, నవంబర్ 21: ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచిచూస్తున్న టాటా టెక్నాలజీస్ తన ఐపీవో తేదీని ప్రకటించారు. డిజిటల్ సర్వీసులకు ఇంజనీరింగ్, ప్రాడక్ట్ డెవలప్మెంట్ సర్వీసుల్ని అందించే ఈ కంపెనీ పబ్లిక్ ఆఫర్ నవంబర్ 22న ప్రారంభమై 24న ముగుస్తుంది. ఆఫర్ ప్రైస్ బ్యాండ్ను రూ.475-500గా నిర్ణయించారు.
పలు టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు ఉన్నప్పటికీ, 19 ఏండ్ల తర్వాత ఆ గ్రూప్ నుంచి వస్తున్న ఐపీవో ఇదే. ఐటీ దిగ్గజం టీసీఎస్ పబ్లిక్ ఆఫర్ 2004 ఆగస్టులో వచ్చింది. రూ.850 ధరతో మదుపరులకు లభించిన టీసీఎస్ షేరు బోనస్ ఇష్యూలు, డివిడెండ్లతో సహా ఎన్నో రెట్లు రాబడిని అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాటా టెక్నాలజీస్ ఐపీవోపై మార్కెట్లో క్రేజ్ నెలకొన్నది. అయితే టాటా టెక్నాలజీస్ టాటాల హోల్డింగ్ సంస్థ టాటా సన్స్ది కాదు.
ఇది ఈ గ్రూప్లోని టాటా మోటార్స్కు సబ్సిడరీ. తాజా ఐపీవోను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో టాటా మోటార్స్, ఇతర ఈక్విటీ ఫండ్స్ జారీచేస్తున్నాయి. టాటా టెక్నాలజీస్ ఈక్విటీ మూలధనంలో 15 శాతానికి సమానమైన 6,08,50,278 షేర్లను విక్రయిస్తుండటంతో రూ.3,042 కోట్ల నిధులు సమీకరించనున్నట్టు టాటా మోటార్స్ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది.
టాటా మోటార్స్ 11.4 శాతం వాటాల్ని ఆఫ్లోడ్ చేస్తున్నది. ప్రైవేటు ఈక్విటీ ఫండ్ అల్ఫా టీసీ హోల్డింగ్స్ 2.4 శాతం, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 1.2 శాతం చొప్పున షేర్లను విక్రయిస్తున్నాయి. ఇది కాకుండా గత నెలలో 9.9 శాతం వాటాను టీపీజీ రైజ్ ైక్లెమేట్కు రూ. 1,613 కోట్లకు అమ్మేందుకు గత నెలలో టాటా మోటార్స్ ఒక ఒప్పందంపై సంతకాలు చేసింది.
రెండు దశాబ్దాల తర్వాత..
ఇంచుమించు రెండు దశాబ్దాల తర్వాత టాటా గ్రూపునకు చెందిన మరో సంస్థ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. 2004 లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) తర్వాత వస్తున్న తొలి సంస్థ టాటా టెక్నాలజీస్ కానుండటం విశేషం. కంపెనీ ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉండటం, తక్కువ ప్రీమియం ఉండటం, భవిష్యత్తులో ఈ రంగం కీలకంగా ఉండనుంటంతో సంస్థ వాటా విక్రయానికి మదుపరుల నుంచి విశేష స్పందన లభించే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
టైటాన్లో 3 వేల ఉద్యోగాలు
ముంబై, నవంబర్ 21: టాటా గ్రూపునకు చెందిన టైటాన్ భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. వచ్చే ఐదేండ్లలో 3 వేల మందిని నియమించుకోనున్నట్టు ప్రకటించింది. ఇంజినీరింగ్, డిజైనింగ్, లగ్జరీ, డిజిటల్, డాటా అనలిటిక్స్, మార్కెటింగ్, విక్రయ విభాగాల్లో తీసుకోనున్నారు. డాటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, ఇతర విభాగాల్లో ప్రతిభ కలిగిన సిబ్బందికోసం వెతుకుతున్నట్లు చెప్పారు.
వచ్చే ఐదేండ్లలో లక్ష కోట్ల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్న టైటాన్ అందుకు తగ్గట్టుగానే తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నట్టు, ఇందుకోసం 3 వేల మంది అదనపు సిబ్బందిని నియమించుకోనున్నట్టు తెలిపారు. వీరిలో 15-18 శాతం మందిని క్యాంపస్ల నుంచి తీసుకోనున్నారు. సంస్థ తనిష్క్, మియా, ఫాస్ట్రాక్, సొనాట, ఐప్లస్, తనేరియా, స్కిన్, కారట్లేన్ బ్రాండ్లతో భారత్తోపాటు అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తున్నది.