Tata Motors-JLR | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. తమిళనాడులో జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) లగ్జరీ కార్లను తయారు చేయాలని భావిస్తున్నది. జేఎల్ఆర్ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు కోసం 100 కోట్ల డాలర్ల పెట్టుడి పెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు టాటా మోటార్స్ వర్గాలు తెలిపాయి. తమిళనాడులోని కొత్త ప్లాంట్లో పెట్టుబడుల ప్రణాళికపై గత నెలలోనే టాటా మోటార్స్ ప్రకటించింది. తమిళనాడులో రూ.9000 కోట్ల పెట్టుబడులు పెడతామని తెలిపింది. కానీ జాగ్వార్ లాండ్ రోవర్ కార్లలో ఏయే మోడల్ కార్లు తయారు చేస్తుందన్న సంగతి వెల్లడించలేదు. దీనిపై స్పందించేందుకు టాటా మోటార్స్ వర్గాలు నిరాకరించాయి. 2008లో బ్రిటన్ కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్)ను టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
తమిళనాడులోని రాణిపేట్ జిల్లా పరిధిలో వేలూర్ కు సమీపంలో టాటా మోటార్స్ రెండో ప్రొడక్షన్ ప్లాంట్ ఏర్పాటు కానున్నదని తెలుస్తున్నది. ఇప్పటికే కర్ణాటకలోని ధార్వాడ్ లో టాటా మోటార్స్ కార్ల తయారీ యూనిట్ పని చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడులో యూనిట్ ఏర్పాటు ద్వారా ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు.