Nexon XM+ (S) | కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ సంగతి గ్రహించిన ఆటోమేకర్లు కూడా కస్టమర్ల ఆకాంక్షలు, అభిరుచులకు అనుగుణంగా సరికొత్త సేఫ్టీ ఫీచర్లతో న్యూ మోడల్ కార్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఆ క్రమంలో టాటా మోటార్స్ దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఆ సంస్థ కార్లలో నెక్సాన్ అత్యంత పాపులర్ ఎస్యూవీ మోడల్. దీంతో మార్కెట్పై పట్టు సాధించేందుకు బుధవారం నెక్సాన్ ఎక్స్ఎం + (ఎస్) వేరియంట్ను బుధవారం మార్కెట్లో ఆవిష్కరించింది.
న్యూ నెక్సాన్ ఎక్స్ఎం + (ఎస్) వేరియంట్ కారు ధర రూ.9.75 లక్షల నుంచి మొదలవుతున్నది. నాలుగు రంగుల్లో ఇది కస్టమర్లకు అందుబాటులోకి వస్తున్నది. కాల్గరీ వైట్, డాయ్టోనా గ్రే, ఫ్లేమ్ రెడ్, ఫులియేజ్ గ్రీన్ వేరియంట్లలో కస్టమర్లు తమకు ఇష్టమైన కలర్ ఎంచుకోవచ్చు. ఎక్స్ఎం (ఎస్), ఎక్స్జడ్ + వేరియంట్లలో కస్టమర్ల మనస్సు దోచుకునేందుకు సిద్ధమైంది న్యూ నెక్సాన్ ఎక్స్ఎం + (ఎస్).
ఎలక్ట్రిక్ సన్రూఫ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతోపాటు ఏడంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 4 స్పీకర్స్ సిస్టమ్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, రేర్ ఏసీ వెంట్స్, రెయిన్ సెన్సింగ్ వైఫర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ డ్రైవ్ మోడ్స్, 12వీ రేర్ పవర్ సాకెట్, షార్క్ ఫిన్ ఆంటీనా తదితర ఫీచర్లు జత చేశారు. 2017లో భారత్ రోడ్లపైకి వచ్చిన టాటా మోటార్స్ నెక్సాన్.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ కార్లలో నాలుగో స్థానంలో ఉంది. తాజాగా తీసుకొచ్చిన నెక్సాన్ ఎక్స్ఎం + (ఎస్) మరింత మంది కస్టమర్లకు చేరువ అవుతుందని టాటా మోటార్స్ సేల్స్, మార్కెటింగ్ కస్టమర్ కేర్ వైస్ప్రెసిడెంట్ రాజన్ అంబా చెప్పారు.