న్యూఢిల్లీ : రాబోయే నాలుగేండ్లలో 10 ఎలక్ట్రిక్ వాహనాలను లాంఛ్ చేసేందుకు సిద్ధమైన టాటా మోటార్స్ ఈ విభాగంలో రూ 15,000 కోట్లు వెచ్చించేందుకు యోచిస్తోంది. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ రైజ్ క్లైమేట్ టాటా మోటార్స్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించిన క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలపై భారీగా వెచ్చించేందుకు దేశీ ఆటోమొబైల్ దిగ్గజం సన్నద్ధమవుతోంది.
ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో 70 శాతం వాటాతో టాటా మోటార్స్ ఇప్పటికే మార్కెట్ లీడర్గా ఉంది. నెక్సాన్, టైగర్ ఈవీలకు నెలకు 3000 నుంచి 3500 యూనిట్ల వరకూ బుకింగ్స్ వస్తున్నాయని తమ సామర్ధ్యం మెరుగుపరుచుకునేందుకు కనీసం మరో పది నూతన గ్రీన్ వాహనాలను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని టాటా మోటార్స్ పీవీ బిజినెస్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు. ఈ దిశగా ఉత్పత్తి సామర్ధ్యం పెంచడంతో పాటు చార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని వెల్లడించారు.