న్యూఢిల్లీ, అక్టోబర్ 29: గత ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను పునరుద్ధరించడానికి టాటాలు భారీ రుణాల్ని సమీకరించాల్సి వస్తున్నది. తాజాగా రూ. 15,000 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ రుణాల కోసం టాటా గ్రూప్ బ్యాంక్లతో చర్చలు జరుపుతున్నది. ఎయిర్క్రాఫ్ట్ల అద్దెలు చెల్లించడానికి, విమానాల్ని ఆధునీకరించడానికి, రోజువారీ సంస్థ నిర్వహణా ఖర్చులు తదితరాల కోసం ఈ రుణాల్ని వినియోగించనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
మూడేండ్ల కాలపరిమితి గల ఈ రుణాన్ని 7.5-8 శాతం వడ్డీ రేటుతో తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు ఆ వర్గాలు వివరించాయి. నిరుడు అక్టోబర్లో ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియాను రూ. 18,000 కోట్లకు టాటా సన్స్ సబ్సిడరీ టలేస్ కొన్న సంగతి తెలిసిందే. గత ఏడాది చివర్లో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాల నుంచి రూ.23,000 కోట్ల ఏడాది కాలపరిమితిగల రుణాన్ని 4.25 శాతం వడ్డీ రేటుపై టలేస్ తీసుకొంది. ఈ రుణం వచ్చే జనవరిలో రెన్యువల్కు వస్తుంది. ఈ మధ్యకాలంలో వడ్డీ రేట్లు పెరగడంతో పాటు వ్యవస్థలో లిక్విడిటీ కొరవడటంతో రుణ సమీకరణ వ్యయాలు అధికమయ్యాయని బ్యాంక్ అధికారి ఒకరు తెలిపారు.
ఎయిర్ ఇండియా వచ్చే ఐదేండ్లలో తన విమానాల సంఖ్యను పెంచుకునేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం సంస్థ వద్ద 113 ఎయిర్క్రాఫ్ట్లు ఉండగా, వాటి సంఖ్యను మూడు రెట్లు పెంచాలని యోచిస్తున్నది. ఈ డిసెంబర్ నుంచి మొదలుకొని వచ్చే 15 నెలల్లో 30 విమానాల్ని తన ఫ్లీట్కు జతచేసేందుకు సెప్టెంబర్ నెలలో బోయింగ్, ఎయిర్బస్లతో ఒక అంగీకారాన్ని ఎయిర్ ఇండియా కుదుర్చుకుంది. ఈ మేరకు 5 బోయింగ్ వైడ్ బాడీడ్ విమానాలు, 25 ఎయిర్బస్ నారో-బాడీడ్ విమానాలు వచ్చి చేరతాయి. స్వల్పకాలిక లీజులు ఖరీదైనప్పటికీ, ఎయిర్ ఇండియా వీటి కోసం ఒప్పందాల్ని కుదుర్చుకుంది. అలాగే ఎయిర్ ఇండియా క్రూను పటిష్ఠపర్చడానికి ఇతర ఎయిర్లైన్స్ నుంచి నిపుణుల్ని రిక్రూట్ చేసుకుని, మార్కెట్ రేట్ల కంటే 50 శాతం ఎక్కువ జీతభత్యాల్ని చెల్లిస్తున్నది.