BSNL | సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గత జూలైలో ప్రముఖ ప్రైవేట్ టెలికం కంపెనీలు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రీచార్జీలు దాదాపు 25 శాతం పెంచేశాయి. దీంతో ప్రైవేట్ మొబైల్ ఫోన్ల యూజర్లు. సదరు ప్రైవేట్ టెలికం కంపెనీలకు రాంరాం చెప్పి ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు కలిసి వచ్చింది. భారీగా ప్రీ పెయిడ్ చార్జీలు పెంచిన ప్రైవేట్ టెలికం సంస్థలు ప్రతి నెలా సబ్ స్క్రైబర్లను భారీగా కోల్పోతుండగా, బీఎస్ఎన్ఎల్ మాత్రం న్యూ సబ్ స్క్రైబర్లను చేర్చుకోవడంలో ముందు వరుసలో నిలిచింది.
జూలైలో మార్కెట్ వాటాలో 7.59 శాతం సబ్ స్క్రైబర్లను పెంచుకున్న బీఎస్ఎన్ఎల్, గత ఆగస్టు నెలలో 7.84 శాతం వాటా పెంచుకోవడం గమనార్హం. ఆగస్టులో బీఎస్ఎన్ఎల్ ఎంచుకున్న సబ్ స్క్రైబర్ల సంఖ్య 25 లక్షలు పెరిగితే, అంతకుముందు జూలైలో 29.4 లక్షల మంది సబ్ స్క్రైబర్లు జత కలిశారని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది.
ట్రాయ్ గణాంకాల ప్రకారం దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ గత ఆగస్టు నెలలో 40 లక్షలు, భారతీ ఎయిర్ టెల్ 24 లక్షలు, వొడాఫోన్ ఐడియా 18.7 లక్షల యూజర్లను కోల్పోయాయి. అంతకు ముందు జూలైలో రిలయన్స్ జియో 7,58,463 మంది సబ్ స్క్రైబర్లు, భారతీ ఎయిర్ టెల్ 16,94,300 మంది, వొడాఫోన్ ఐడియా 14,13,910 మంది సబ్ స్క్రైబర్లను కోల్పోయింది. మూడు ప్రైవేట్ టెలికం కంపెనీలు ఆగస్టు నెలలో 83 లక్షలు, జూలైలో 38.6 లక్షల సబ్ స్క్రైబర్లను కోల్పోయాయి.