న్యూఢిల్లీ : కొత్త ఏడాదిలోనూ మాస్ లేఆఫ్స్ కొనసాగడం ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. ఏ క్షణం కొలువు కోల్పోతామనే భయం వెంటాడుతోంది. తాజాగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ 380 మంది ఉద్యోగులపై వేటు వేసింది. లేఆఫ్స్ బాధితులకు ఈమెయిల్స్ పంపుతూ సమాచారం చేరవేశారు. ఉద్యోగులను తొలగిస్తూ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని, ఇందుకు తమను మన్నించాలని కంపెనీ సీఈఓ శ్రీహర్ష మాజేటి కోరారు.
వ్యాపార పునర్వ్యస్ధీకరణలో భాగంగా ఈ సంక్లిష్ట నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. సవాళ్లతో కూడిన స్ధూల ఆర్ధిక పరిస్ధితులే ఈ నిర్ణయానికి పురిగొల్పాయని చెప్పుకొచ్చారు. ఫుడ్ డెలివరీ సెగ్మెంట్లో వృద్ధి రేటు మందగించిందని కంపెనీ వెల్లడించింది. మందగమనంతో లాభాలు సన్నగిల్లి రాబడి తగ్గిపోయిందని పేర్కొంది.
ఇబ్బడిముబ్బడిగా హైరింగ్ చేపట్టడం కూడా తాజా లేఆఫ్స్ నిర్ణయానికి దారితీసిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. తొలగించిన ఉద్యోగులకు బాసటగా నిలుస్తామని మూడు నుంచి ఆరు నెలల్లోగా వారికి నగదు సాయం అందిస్తామని కంపెనీ పేర్కొంది. కంపెనీలో వారు పనిచేసిన కాలం, గ్రేడ్ ఆధారంగా ఈ సాయం ఉంటుందని తెలిపింది. లేఆఫ్స్కు గురైన ఉద్యోగులకు మూడు నెలల వేతనం, ఒక్కో ఏడాది సర్వీసుకు 15 రోజుల ఎక్స్గ్రేషియాతో పాటు ఎర్న్డ్ లీవులకు చెల్లింపులు చేస్తామని పేర్కొంది.